TVK Vijay Government: విజయ్‌ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!

  • తమిళనాడులో టీవీకే విజయ్‌ ప్రభుత్వం 100 రోజుల పాలన..
  • సంక్షేమం, పెట్టుబడులు, అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం..
  • అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం ప్రత్యేక చర్యలు..
  • ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు..
  • ఉదయనిధి స్టాలిన్‌ విజయ్‌ను ‘డమ్మీ సీఎం’ అంటూ విమర్శలు..
Tvk Vijay Government

Tvk Vijay Government

TVK Vijay Government Completes 100 Days in Tamil Nadu: తమిళనాడులో టీవీకే విజయ్‌ ప్రభుత్వం ఏర్పడి నేటితో 100 రోజులు పూర్తయ్యాయి. ఈ వంద రోజుల పాలనలో సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ, అవినీతి నిర్మూలన, పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. పాత రాజకీయాలకు చెక్‌ పెట్టి కొత్త తరహా పాలనకు నాంది పలికామని ప్రభుత్వం అంటోంది. అయితే ప్రభుత్వ వంద రోజుల పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

సంక్షేమ పథకాలపై దృష్టి..

వంద రోజుల పాలనలో మహిళలు, రైతులు, పేద కుటుంబాలు, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. చిన్న రైతులకు రూ.50 వేల వరకు పంట రుణమాఫీ, మహిళా సంక్షేమ పథకాలు, నవజాత శిశువులకు బంగారు ఉంగరం పథకం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు అందించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే పేదలకు అందుబాటులో ఉండే అమ్మ క్యాంటీన్లను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

717 టాస్మాక్‌ దుకాణాల మూసివేత:

విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్న 717 టాస్మాక్‌ మద్యం దుకాణాలను మూసివేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజల భద్రత, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 58% నుంచి 60%కి పెంచినట్లు పేర్కొంది.

రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులు:

పెట్టుబడుల ఆకర్షణలోనూ తమ ప్రభుత్వం ముందంజలో ఉందని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. కేవలం 100 రోజుల్లోనే రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నాయి. దీనివల్ల కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అవినీతి రహిత పాలనకు ప్రాధాన్యం..

అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలతో అధికారులు మర్యాదగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ప్రజల సమస్యలను ఒకే కార్యాలయంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. పాలనలో పారదర్శకత పెంచేందుకు సాంకేతికతతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.

ప్రతిపక్షాల విమర్శలు:

మరోవైపు విజయ్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. వంద రోజుల్లో చెప్పుకోదగ్గ కొత్త పథకాలు ఏమి ప్రవేశపెట్టారని ప్రశ్నిస్తున్నాయి. గత డీఎంకే ప్రభుత్వంలో అమలైన పథకాలకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ విజయ్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను “డమ్మీ సీఎం” అంటూ విమర్శించిన ఆయన.. సోషల్‌ మీడియా రీల్స్‌ మినహా ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. టీవీకే ప్రభుత్వానికి సొంత విధానాలు, కొత్త ఆలోచనలు లేవని విమర్శించారు.

రైతులకు ఇచ్చిన హామీల అమలుపైనా ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడులు ఒకవైపు ఉంటే.. క్షేత్రస్థాయిలో పాలన మరోలా ఉందని విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేత అన్నామలై కూడా ప్రభుత్వం తీరుపై ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలోని కొందరు మంత్రులపై కమీషన్ల ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. టెండర్లలో 2 నుంచి 4 శాతం వరకు కమీషన్‌ అడుగుతున్నారంటూ ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వంద రోజుల పాలనపై ప్రభుత్వం స్వయంగా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.