Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో
  • భారీ ప్రమాదం తృటిలో తప్పింది.
  • ఇస్తాంబుల్ నుంచి వచ్చిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి ల్యాండింగ్ సమయంలో మంటలు
  • విమానం కుడివైపు టైర్ల వద్ద మంటలు
  • ఫైర్ ఇంజిన్ల సహాయంతో వెంటనే మంటలను అదుపులోకి
  • విమానంలో ఉన్న 278 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు..
Kathmandu

Kathmandu

Kathmandu: నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఇస్తాంబుల్ నుంచి ఖాట్మండుకు వస్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అధికారుల వివరాల ప్రకారం.. TK726 కాల్‌సైన్‌ తో ప్రయాణిస్తున్న ఈ విమానం ఇస్తాంబుల్ నుంచి ఖాట్మండుకు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం కుడివైపు టైర్ల వద్ద మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అత్యవసర చర్యలు చేపట్టి ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనపై విమానాశ్రయ భద్రతా విభాగం అధికారి రాజ్‌కుమార్ సిలావాల్ మాట్లాడుతూ.. “విమానం ల్యాండింగ్ సమయంలో టైర్లకు మంటలు అంటుకున్నాయి. ఫైర్ ఇంజిన్ల సహాయంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. అందరూ సురక్షితంగా బయటపడ్డారు” అని తెలిపారు.

విమానంలో మొత్తం 278 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో కొంతమంది ఐక్యరాజ్యసమితి (UN) అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో కుడివైపు ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్ముకున్న దృశ్యాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి.అయితే అత్యవసర ద్వారాల ద్వారా ప్రయాణికులను బయటకు తరలించారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు, టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.