OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది..?

  • కాంగ్రెస్‌లో తుంగతుర్తి లొల్లిపై జగ్గారెడ్డి రిపోర్ట్‌..
  • జగ్గారెడ్డి ఎవర్ని తప్పు పట్టారంటూ పార్టీ వర్గాల ఆరా..
  • ఎమ్మెల్యే సామేల్‌ ఏఐసీసీ రూల్స్‌ పాటించలేదని రాశారా?
Jaggareddy

Jaggareddy

తుంగతుర్తి లొల్లి విషయమై కాంగ్రెస్‌ పెద్దలకు క్లారిటీ వచ్చిందా? పీసీసీ నియమించిన జగ్గారెడ్డి కమిషన్‌ రిపోర్ట్‌లో ఏముంది? తన నివేదికలో ఎవర్ని తప్పు పట్టారు జగ్గన్న? అసలా పంచాయితీ సెట్‌ అయ్యే అవకాశం ఉందా? రిపోర్ట్‌ ప్రకారం చర్యలు ఉంటాయా? లెట్స్‌ వాచ్‌.

తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన కేడర్‌ ఉంది. ఇక్కడ పార్టీలోని కీలక నాయకుల ఫోకస్ కూడా ఎక్కువే. ఎవరైనాసరే… కలుపుగోలుగా ఉండి కాస్త లౌక్యం ప్రదర్శించగలిగితే చాలు…దీనంత సేఫ్ నియోజకవర్గం ఎక్కడా ఉండదని పార్టీ నాయకులే చెప్పుకుంటారు. కానీ… అందుకు భిన్నంగా ఇటీవల ఇక్కడి వివాదాలు రచ్చకెక్కాయి. చివరికి కార్యకర్తలు రాళ్ళు రువ్వుకునే వరకు వెళ్ళింది వ్యవహారం. తర్వాత అది ఇంకా ముదిరి కొత్త..పాత నాయకుల లొల్లిగా మారింది. దీంతో… ఇందులోని వాస్తవావాస్తవాలను తేల్చే బాధ్యతను సీనియర్ లీడర్‌ జగ్గారెడ్డికి అప్పగించింది పీసీసీ. తాజాగా తుంగతుర్తి పంచాయితీపై రిపోర్ట్‌ ఇచ్చారాయన. ఈలోపే… ఎమ్మెల్యేలు సామేల్‌, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కూడా జరిగిపోయింది. ఆ సంగతి ఎలా ఉన్నా… జగ్గారెడ్డి నివేదికలో ఏముంది..? ఆయన ఎవరిని తప్పు పట్టారంటూ ఆరా తీస్తున్నాయి పార్టీ వర్గాలు.

మాజీ ఎమ్మెల్యే తన నివేదికలో కీలకమైన అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మండల కమిటీల నియామకంలో ఏఐసీసీ నిబంధనలను సామేల్‌ పాటించలేదని, పూర్తిగా ఉల్లంఘన జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. నియోజకవర్గంలో 9 మండలాలు ఉంటే… అందులో అర్వపల్లి, మద్దిరాల, తిరుమలగిరి మండలాల్లో పంచాయితీలు ఎక్కువ. అర్వపల్లి మండల అధ్యక్షుడి నియామకంలో రూల్స్‌ పాటించలేదని నివేదికలో వివరించినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత వచ్చిన వ్యక్తికి మండల అధ్యక్ష పదవి కట్టబెట్టారని జగ్గారెడ్డి స్పష్టం చేశారట. MLA అధ్యక్ష పదవి ఇచ్చిన వ్యక్తి సూర్యాపేటలో రెబల్‌గా పోటీ చేశారని నివేదికలో వివరించారట. తిరుమలగిరి టౌన్ లీడర్ కి.. రూరల్ మండలం బాధ్యతలు ఇచ్చినట్టు సమాచారం. ఇదే మండలంలో సీనియర్ నేత… మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సొంత ఊరు ఉంది. ఉత్తమ్ ప్రతిపాదించిన నాయకుడి పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదని నివేదికలో ఉందంటున్నారు.

ఇక మద్దిరాల మండలంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఎక్కువ. అలాగే ఎంపీ చామల ఇక్కడ స్థానికుడు. ఆయన ఓ నాయకుడి పేరు ప్రతిపాదించారు. ఎంపీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కలిసి ఒకే పేరు ప్రతిపాదించినా…ఎమ్మెల్యే సామేల్‌ పూర్తిగా పక్కకు పెట్టినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే… సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కూడా తుంగతుర్తి నియోజక వర్గం వాసి. ఆయన ప్రతిపాదనల్ని కూడా పక్కన పెట్టేశారట MLA. ఆ రకంగా ఈ మూడు మండలాలకు సంబంధించే ప్రధానంగా లొల్లి పెరిగినట్టు సమాచారం. అందుకు తగ్గట్టే మూడు చోట్ల పదవుల మార్పు ఉండవచ్చని అంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే హక్కుల్ని కూడా తన నివేదికలో ప్రస్తావించారట జగ్గారెడ్డి. అంతవరకు బాగానే ఉన్నా…. జగ్గారెడ్డి ఇచ్చిన నివేదికను పీసీసీ ఎప్పుడు అమలు చేస్తుంది? ఒకవేళ చేయకుంటే ఆయన ఎలా రియాక్ట్‌ అవుతారన్నది కూడా ఇక్కడ కీలకమేనని అంటున్నారు కాంగ్రెస్‌ నాయకులు.