ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుఠానీ తండా నుంచి రేపల్లెవాడ వరకు ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సరైన వర్షపాతం నమోదు కాలేదని, ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే దీర్ఘకాలిక సాంప్రదాయ పంటలను సాగు చేసి రైతులు నష్టపోవద్దని విజ్ఞప్తి చేశారు.
సాగునీటి కొరతను తట్టుకుంటూ, ఎలాంటి నష్టాలు లేకుండా దీర్ఘకాలిక ఆదాయాన్ని ఇచ్చే పామాయిల్ సాగు రైతులకు ఒక వరం లాంటిదని చెప్పారు. ముఖ్యంగా గిరిజన రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని, ఇది వారి ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. తమ సొంత పట్టా భూముల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పొంది బోర్లు వేసుకునే గిరిజన రైతులకు అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ఆయన ఆదేశించారు.
రఘునాథపాలెం మండలానికి రాబోయే రోజుల్లో అభివృద్ధి మహర్దశ పడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేస్తూ మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 100 కోట్లతో మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు , పొలాలకు సిమెంట్, బీటీ రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల ప్రజలు తమ పిల్లలను బాగా చదివించాలని, విద్యతోనే కుటుంబాలలో, సమాజంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

