TRS Parliament Members Protest at Delhi Parliament Premises.
గత సోమవారం వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే… ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లపై రేట్లు పెంచుతున్నట్లు బిల్లు పెట్టారు. అయితే దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులపై ఇప్పటికే పెనుభారం మోపుతున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ రేట్లు పెంచి మరింత సామాన్యుల నడ్డి విరిచేందుకు సిద్ధమైందంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో జీఎస్టీ రేట్ల పెంపుపై ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే. కేశవరావు నేతృత్వంలో విపక్ష పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర బీజేపీ ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు, గ్యాస్ ధరల పెంపు పై ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలు, పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు.