Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు

  • చింతూరు ఏజెన్సీలో మరోసారి డోలీ మోత..
  • పాము కాటుకు గురైన 16 ఏళ్ల సమ్మక్క ప్రియ..
  • కర్మన్ కొండ గ్రామం నుంచి డోలీలో కూటూరుకు తరలింపు...
  • 4 కొండలు ఎక్కి, దిగి బాధితురాలిని మోసుకెళ్లిన గిరిజనులు..
Polavaram Agency

Polavaram Agency

Polavaram Agency: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో వైద్య, రవాణా సౌకర్యాల కొరత మరోసారి బహిర్గతమైంది. పాము కాటుకు గురైన ఓ గిరిజన బాలికను అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డోలిలో మోసుకుంటూ కొండలు దాటి ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతూరు మండలం కర్మన్ కొండ గ్రామానికి చెందిన 16 ఏళ్ల సమ్మక్క ప్రియ పాము కాటుకు గురైంది. అత్యవసరంగా వైద్యం అవసరమైనప్పటికీ గ్రామానికి అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో కొండరెడ్డి గిరిజనులు బాలికను డోలిలో పడుకోబెట్టి సుమారు నాలుగు కొండలు ఎక్కి, దిగి కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఈఎంటీ వెంకట్ విధుల్లో లేకపోయినా మానవత్వంతో స్పందించారు. తన సొంత బైక్‌పై వెళ్లి బాధితురాలిని ఆసుపత్రికి చేర్చేందుకు సహకరించారు. అయితే కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న తర్వాత అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్ బాలికకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనతో స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ డోలి మోతలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అత్యవసర వైద్య సేవలు, రోడ్లు, అంబులెన్స్ సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది.