Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!

Uday Krishna Reddy Arrested

Uday Krishna Reddy Arrested

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన లైంగిక వేధింపులు, దాడి కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని దామరచర్ల వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. మరికొద్ది సేపట్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 18న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన రెండు రోజుల తర్వాత.. ఈ నెల 20న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు రోజుల పాటు చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న తన స్వగ్రామంలో ఉదయ్ కృష్ణారెడ్డి కనిపించారు.

తాను ఎక్కడికీ పారిపోలేదని, తన నాయనమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో సొంతూరుకు వచ్చానని ఉదయ్ కృష్ణారెడ్డి మీడియాతో చెప్పారు. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా అని చెప్పారు. హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు అర్ధరాత్రి వరకు నమోదు చేశారు.

మరోవైపు ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆమె మెడపై గాయాల మచ్చలు, చెంపపై గాయాల ఆనవాళ్లు, ఎడమ కాలిపై కూడా గాయాలు ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.