వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరగాల్సి ఉండగా, నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన అందరినీ కలచివేసింది. పండగ వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా గడపాల్సిన చోట, కుటుంబంలో నవ్వులు నింపాల్సిన యువకుడు ఒక్కసారిగా విగతజీవిగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వినాయక చవితి వేడుకలు ఇంతటి శోకంతో ముగుస్తాయని ఆ కుటుంబసభ్యులు కలలో కూడా ఊహించి ఉండరు. ఆనందంగా గడపాల్సిన వేడుకలు ఆ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చాయి.
డోన్ పట్టణంలో జరిగిన వినాయక చవితి శోభాయాత్రలో స్థానిక యువకుడు గణేష్ గౌడ్ (23) ఉత్సాహంగా, భక్తిభావంతో పాల్గొన్నారు. భక్తులతో కలిసి గణేష్ గౌడ్ డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఆనందంగా గడిపారు. అందరితో కలిసి సరదాగా గడిపిన కొన్ని గంటలకే అతని ఆరోగ్యం క్షీణించింది. ఊరేగింపు ముగిసిన తర్వాత గణేష్ గౌడ్ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ఆయనకు ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో పాటు గుండెపోటు సంభవించింది. కుటుంబసభ్యులు తేరుకునే లోపే ఆయన పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందారు.
వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే గణేష్ గౌడ్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. 23 ఏళ్ల వయసున్న యువకుడు, క్షణాల వ్యవధిలో గుండెపోటుతో మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కగానొక కొడుకు కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన యువకుడు ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ ఇంటి తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ఈ దారుణ ఘటన డోన్ పట్టణంలో తీవ్ర విషాద ఛాయలను నింపింది. గణేష్ గౌడ్ మృతి వార్త తెలిసిన వెంటనే స్నేహితులు, స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. యువతలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగించింది.

