పూణేలో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పుష్-అప్స్ చేస్తుండగా బాస్కెట్బాల్ హూప్ అతనిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆరోగ్య పరిస్థతి విషమించడంతో సెకండ్ ఇయర్ బీ.టెక్ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విశాల్ వర్మ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం టోలానీ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్వేతా ఖేడ్కర్ హామీ ఇచ్చారు.
ఈ సంఘటన పూణేలోని తలేగావ్లోని ఇండోరి ప్రాంతంలో జరిగింది . నివేదికల ప్రకారం, విశాల్ వర్మ బాస్కెట్బాల్ కోర్ట్ లో రింగ్పై పుష్-అప్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బరువైన ఇనుప రింగ్ అకస్మాత్తుగా విరిగి అతని తలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అధిక రక్తస్రావం కారణంగా స్పృహ కోల్పోయాడు. అనంతరం తలేగావ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స అనంతరం వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరిగిందని విద్యార్థులు ఆరోపించారు.
Also Read:కిడ్నీ రాళ్లు కరిగించాలా? ఈ డైట్ తప్పనిసరి!
ఈ ఘటన అనంతరం టోలానీ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఘటనా స్థలానికి భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా ఖేడ్కర్ తెలిపారు.