NTV Telugu Site icon

Top Headlines@5PM: టాప్‌న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌లో రెండు కాజ్‌వే వంతెనలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు చాదర్‌ఘాట్ మరియు మూసారాంబాగ్, అంబర్‌పేట్ వద్ద లో లెవల్ వంతెనల స్థానంలో కొత్త ఎత్తైన వంతెనలను నిర్మించడానికి వ్యూహాన్ని రూపొందించారు. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు విభాగం అధికారులు నిర్మించనున్న వంతెనల నమూనాలను కూడా సిద్ధం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌ లోలెవల్‌ వంతెనలు పూర్తిగా నీటిలో మునిగిపోవడం గమనార్హం. ఈ రెండు వంతెనల నుంచి నీరు ప్రవహించడంతో స్థానిక ఆవాసాలు, కాలనీల్లోకి నీరు చేరడంతో లోతుగా సమీక్షించిన అనంతరం వరద సమస్యల పరిష్కారానికి కొత్త వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చాదర్‌ఘాట్‌ సమీపంలో 1890లో నిర్మించిన ఒలిఫెంట్‌ బ్రిడ్జిపై కొత్త కాజ్‌వే వంతెనతోపాటు మూసారాంబాగ్‌ సమీపంలో వంతెన నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. లోలెవల్ వంతెనల స్థానంలో కొత్త వంతెనల నిర్మాణానికి రూ.94 కోట్లతో అంచనా వ్యయం సిద్ధం చేశారు. వీటిలో చాదర్‌ఘాట్‌ కాజ్‌వే వంతెన నిర్మాణానికి రూ.42 కోట్లు, మూసారాంబాగ్‌ వంతెన నిర్మాణానికి రూ.52 కోట్లు వెచ్చించనున్నారు.

గుజరాత్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

గుజరాత్లో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.రాజ్‌కోట్‌కు 270 కిలోమీటర్ల దూరంలో భూమికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మధ్యాహ్నం 3:21 గంటలకు భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గత వారం, గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో రెండు రోజుల్లో మూడు చిన్నపాటి ప్రకంపనలు నమోదయ్యాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) అధికారి ఒకరు చెప్పినట్లు తెలిసింది. భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌లో వెళ్తున్న ముగ్గురు యువకులు కారుని తప్పించబోయి, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమలాపురంలోని శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు, ఈరోజు కాలేజీలో ప్రాక్టికల్స్‌కు వెళ్లారు. ప్రాక్టికల్స్ అయ్యాక ముగ్గురు తిరిగి ఇంటికి బైక్‌లో బయలుదేరారు. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం వద్దకు చేరుకున్నప్పుడు.. తమ ముందున్న కారుని తప్పించబోయేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న లారీని వీళ్లు గమనించలేకపోయారు. సునాయాసంగా దాటేయొచ్చని అనుకున్నారు.

మరో యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం.. ఈ సారి తూర్పు నుంచి పడమరకు..

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తైంది. ఆ యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. మరో యాత్ర తూర్పు నుంచి పడమరకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్‌ చేస్తోంది. పాసిఘాట్‌ నుంచి పోర్‌బందర్‌ యాత్రను కాంగ్రెస్‌ పరిశీలిస్తోందని, భారత్‌ జోడో యాత్రను ముందుకు తీసుకెళ్లాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఆదివారం తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు గాంధీజీతో పాటు అనేక మంది కాంగ్రెస్‌ నాయకులు చేపట్టిన దాదాపు 4,000 కిలోమీటర్ల కన్యాకుమారి-కాశ్మీర్‌ యాత్ర తర్వాత మరో యాత్ర కోసం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం, శక్తి పుంజుకున్నాయని రమేష్‌ పేర్కొన్నారు.

ఇటలీ తీరంలో విషాదం.. శరణార్థుల పడవ మునిగి 34 మంది మృతి

ఇటలీ తీరంలో విషాద ఘటన జరిగింది. శరణార్థులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిలో ఓ పసికందు కూడా ఉండడం స్థానిక అధికారులను కలచివేసింది. ఈ పడవలో 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు.

ఫెబ్ 27 నుంచి ఒటీటీలో కనిపించనున్న మాస్ మూల విరాట్

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిరు వింటేజ్ మాస్ గెటప్ లో కనిపించి సంక్రాంతిని కాస్త ముందుగానే తెచ్చాడు. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు టైమింగ్, డాన్స్ లో గ్రేస్, ఫ్యాన్ స్టఫ్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసిన దర్శకుడు బాబీ సాలిడ్ హిట్ కొట్టాడు. మాస్ మూలవిరాట్ గా కనిపించిన చిరు ఒకప్పటి మెగాస్టార్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ గుర్తు చేశాడు. ఇక బాబీ ట్రంప్ కార్డ్ అయిన రవితేజ ఎపిసోడ్ ని వాల్తేరు వీరయ్య సినిమాకే హైలైట్ గా మలిచారు. చిరు, రవితేజల మధ్య వచ్చే సీన్స్, ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా పండించిన ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి.

న్యూడ్ ఫోటోల కలకలం.. రితికా సింగ్ కలవరం

‘మీమ్స్ ట్రెండ్’ మొదలైన కొత్తలో.. నెటిజన్లు సరదాగా నవ్వుకునేలా మీమ్స్ చేసేవారు. కానీ.. కాలక్రమంలో కొందరు తప్పుదారి పట్టారు. నవ్వించడానికి బదులు.. డబుల్ మీనింగ్ మీమ్స్ చేయడం స్టార్ట్ చేశారు. రానురాను అది మరింత హద్దుమీరింది. కథానాయికల ఫోటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫోటోలను సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే, కొందరు దుండగులు మాత్రం మార్ఫింగ్ చేయడం ఆపట్లేదు. అంతకంటే ఎక్కువగానే రెచ్చిపోతున్నారు. డబుల్ మీనింగ్ మీమ్స్‌తో పాటు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నారు. పెద్ద పెద్ద కథానాయికల్ని సైతం విడిచిపెట్టట్లేదు.

కుప్పకూలిన మెడికల్‌ ట్రాన్స్‌పోర్ట్ విమానం.. రోగితో పాటు ఐదుగురు మృతి

అమెరికాలో పశ్చిమ రాష్ట్రమైన నెవాడాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మెడికల్‌ ట్రాన్స్‌పోర్ట్ విమానం కుప్పకూలడంతో అందులో రోగితో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నెవాడా సరిహద్దులో శుక్రవారం రాత్రి విమానం రాడార్‌ నుంచి బయటపడిందని ఓ ప్రకటన ద్వారా తెలిసింది. విమానంలో ఉన్న ఐదుగురిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని సెంట్రల్‌ లియోన్‌ కౌంటీ అగ్నిమాపకశాఖ ప్రకటించింది.