Today Stock Market Roundup 02-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. 8 రోజుల నష్టాల తర్వాత నిన్న బుధవారం లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లో ఇవాళ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రోజు గురువారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో కూడా కోలుకోలేకపోయాయి.
ఐటీ మరియు బ్యాంకులు, ఆటోమొబైల్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కోవటంతో సాయంత్రం భారీ నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి పెద్ద పెద్ద సంస్థల షేర్లు పడిపోవటం దెబ్బతీసింది. ఇదిలాఉండగా.. అదానీ గ్రూప్ కంపెనీలపై దర్యాప్తు జరిపి 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. అయితే.. ఈ తీర్పు ఆ ప్రభావం అదానీ గ్రూప్ షేర్లపైన పడలేదు.
Indian Companies Q3 Earnings: విశ్లేషకులు చెప్పినదానికన్నా మంచి ఫలితాలు
ఫలితంగా.. అవి స్వల్ప లాభాలతో ట్రేడింగ్ను ముగించాయి. సెన్సెక్స్ 502 పాయింట్లు కోల్పోయి 58 వేల 909 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 129 పాయింట్లు తగ్గి 17 వేల 321 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 25 కంపెనీలు నేల చూపులు చూశాయి.
మారుతి, యాక్సిస్ సంస్థల షేర్ల విలువ ఘోరంగా దిగజారింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ సుమారు సున్నా పాయింట్ 2 శాతం విలువ కోల్పోయాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ రాణించింది.
దాదాపు ఒక శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం బాగా వెనకబడింది. ఒక శాతానికి పైగా డౌన్ అయింది. వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే.. RVNL షేర్ల విలువ 10 శాతం పెరిగింది. 200 వందే భారత్ ట్రైన్ల తయారీకి పోటీ పడుతున్న సంస్థల జాబితాలో ఈ కంపెనీ సైతం నిలవటం సానుకూలంగా మారింది.
సొనాటా సాఫ్ట్వేర్ స్టాక్స్ 5 శాతం ర్యాలీ తీశాయి. 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 79 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 55 వేల 751 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 651 రూపాయలు కోల్పోయింది.
అత్యధికంగా 63 వేల 284 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 107 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 466 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 9 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 59 పైసల వద్ద స్థిరపడింది.