Today Business Headlines 31-03-23:
వెయ్యి మందికి జాబ్స్
హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సర్వీసుల సంస్థ ప్లూరల్ టెక్నాలజీస్.. వచ్చే మూడు సంవత్సరాల్లో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వాళ్లను టెక్నాలజీ కన్సల్టెంట్లుగా నియమించుకొని.. అందులో సగం మందికి జపనీస్ భాషలో ట్రైనింగ్ ఇవ్వనుంది. జపాన్ పార్ట్నర్ కంపెనీ సీసమ్ టెక్నాలజీస్తో కలిసి 2025 చివరి నాటికి ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ సర్వీసెస్లో 10 కోట్ల డాలర్ల బిజినెస్ చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాలను ప్లూరల్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జి్క్యూటివ్ ఆఫీసర్ సునిల్ సవరం చెప్పారు.
బద్రికి విప్రో ప్రమోషన్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ విప్రో.. ఇండియా, ఆగ్నేయ ఆసియా అధిపతిగా బద్రి శ్రీనివాసన్ నియమితులయ్యారు. ఆసియా పసిఫిక్, మిడిలీస్ట్, ఇండియా, ఆఫ్రికా వ్యూహాత్మక మార్కెటింగ్ యూనిట్లో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. బద్రి శ్రీనివాసన్ గతేడాది జనవరిలో ఆగ్నేయ ఆసియా ఎండీగా విప్రోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఖాతాదారులకు కావాల్సిన సేవలు అందించటంలో మరియు విప్రో సామర్థ్యాలను వాడుకోవటంతోపాటు అవకాశాలను అందిపుచ్చుకోవటంలో ఆయన ఎక్స్పర్ట్ అని సంస్థ పేర్కొంది.
ఎయిడ్స్ నివారణకు
ఎయిడ్స్ వ్యాధి నివారణ మందును తయారుచేసేందుకు అరబిందో ఫార్మా సంస్థ.. మెడిసిన్స్ పేటెంట్ పూల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా క్యాబొటిగ్రావిర్ ట్యాబ్లెట్లను మరియు ఇంజెక్టబుల్స్ను రూపొందించి విక్రయించనుంది. ఈ మెడిసిన్ని వీఐఐవీ హెల్త్ కేర్ కంపెనీ డెవలప్ చేసింది. అయితే.. జనరిక్ ఔషధానికి కావాల్సిన ఏపీఐని మాత్రం అరబిందో సంస్థే తయారుచేసుకుంటుంది. నాయుడుపేటలోని యూనిట్-4తోపాటు వైజాగ్లోని యూజియా స్టెరైల్ యూనిట్లో మందు గోలీలను, ఇంజెక్టబుల్స్ను రూపొందిస్తారు.
85% మందికి లేఆఫ్
బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ స్థాపించిన విర్జిన్ ఆర్బిట్ అనే రాకెట్ కంపెనీ 85 శాతం ఉద్యోగులకు.. అంటే.. దాదాపు 675 మందికి లేఆఫ్ ప్రకటించింది. నిధుల సమీకరణలో విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సీఈఓ డాన్ హార్ట్ తెలిపారు. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్కి సమాచారం ఇచ్చింది. విర్జిన్ ఆర్బిట్ని బ్రాన్సన్ 2017లో స్థాపించారు. ఈ సంస్థ ఎయిర్లాంచ్డ్ రాకెట్లను అభివృద్ధి చేస్తోంది.
”హీరో” సీఈఓగా..
మోటార్ సైకిల్ మరియు స్కూటర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. నిరంజన్ గుప్తాకు సీఈఓగా ప్రమోషన్ ఇచ్చింది. ఈయన ప్రస్తుతం సీఎఫ్ఓగా స్ట్రాటజీ విభాగంతోపాటు ఎం అండ్ ఏ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు. మే నెల నుంచి సీఈఓగా బాధ్యతలు చేపడతారు. హార్లీ డేవిడ్సన్ మరియు జీరో మోటార్ సైకిల్స్ వంటి గ్లోబల్ బ్రాండ్స్తో పార్ట్నర్షిప్లను కుదర్చటంలో కీలక పాత్ర పోషించారు. వివిధ రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో.. పలు కంపెనీల్లో.. నిరంజన్ గుప్తాకి పాతికేళ్లకు పైగా అనుభవం ఉందని హీరో మోటోకార్ప్ తెలిపింది.
కల్చరల్ సెంటర్ లాంఛ్
రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ముంబైలో ఏర్పాటుచేసిన కల్చరల్ సెంటర్ ఈరోజు ప్రారంభం కానుంది. భారతీయ సంగీతం, నాటక రంగం, లలిత కళలు మరియు చేతివృత్తులకు సంబంధించిన ప్రదర్శనను ఇందులో తిలకించొచ్చు. పిల్లు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తదితరులకు ఈ సెంటర్లోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఇందులో 2 వేల సీట్ల సామర్థ్యం కలిగిన గ్రాండ్ థియేటర్ ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద స్టేజీ కలిగిన ప్రపంచ స్థాయి వేదిక ఈ థియేటర్ సొంతం.