జట్టు సభ్యులం అందరం కలిసి టీమిండియా గెలుపు కోసం కృషి చేశాం అని ఆసియా కప్ 2025 ఫైనల్ హీరో, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్పై మన దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడానని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్లో చాలా ఒత్తిడిలోనే తాను బ్యాటింగ్ చేశానన్నాడు. ఆసియా కప్ టోర్నీలో అందరం సమష్టిగా కష్టపడ్డాం అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఫైనల్లో చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగిన విషయం తెలిసిందే. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్కు ఒంటరి పోరాటంతో తిలక్ గెలుపు బాటలు వేశాడు.
ఆసియా కప్ 2025 ఫైనల్లో తిలక్ వర్మ వీరోచిత పోరాటంతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు. 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. హైఓల్టేజ్ మ్యాచ్లో చెలరేగిన తిలక్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. మనోడిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తిలక్ సోమవారం యూఏఈ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతడికి ప్రభుత్వ అధికారులు, ఫాన్స్ ఘన స్వాగతం పలికారు.
తిలక్ వర్మ ఈరోజు లింగంపల్లిలోని లేగల గ్రౌండ్కు వెళ్లారు. అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు. అనంతరం తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా సంతోషంగా ఉంది. ఆసియా కప్ ఫైనల్లోని ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుంటుంది. ఫైనల్లో అందరం సమష్టిగా కష్టపడ్డాం. నేను చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా. దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతో ఆడా. పాకిస్థాన్ ప్లేయర్స్ చాలా ఒత్తిడికి గురిచేశారు, అయినా పట్టించుకోలేదు. మ్యాచ్ గెలిచి వారికి ధీటుగా బదులివ్వాలని అనుకున్నా. టోర్నీలో ప్రతి మ్యాచ్లో వ్యూహాలు మార్చుకుంటూ ముందుకువెళ్లాం. నా విజయంలో తల్లిదండ్రులు, కోచ్ దే కీలక పాత్ర. నా క్రికెట్ కెరీర్ కోసం చిన్నప్పటినుంచి ఎంతో కృషి చేశారు’ అని చెప్పాడు.
‘విరాట్ కోహ్లీ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. కోహ్లీతో నన్ను పోల్చడం గర్వంగా అనిపిస్తోంది. భారత జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఆసియా కప్ 2025 ఫైనల్లో గెలవడం ఆనందంగా ఉంది. మా కళ్ల ముందు దేశమే కనిపించింది’ తిలక్ వర్మ భావోద్వేగం చెందాడు. నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో మాట్లాడుతూ.. ఆపరేషన్ తిలక్ వర్మ అని దేశమంతా అంటుండటం చాలా గర్వంగా ఉందన్నాడు. ఈ సంతోషాన్ని ఎలా పంచుకోవాలో కూడా తెలియడం లేదని తిలక్ తెలిపాడు.
