లఖింపూర్ ఖేరీ ఘటనలో యూపీ ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హారీష్ సాల్వే 68 మంది సాక్షుల్లో 30 మంది వాంగ్మూలాలను రికార్డు చేసినట్లు తెలిపారు. దీన్లో 23 మంది తమను తాము ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నట్టు తెలిపారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్రామన్ కశ్యప్, మరో మృతుడు శ్యామ్ సుందర్ మరణాలపై దర్యాప్తు వివరాలను వెల్లడించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
దీనికి సంబంధించిన నివేదికలను, వీడియోలను త్వరగా ఇవ్వాలని ఫోరెన్సిక్ విభాగాన్ని కోరింది. లఖింపూర్ ఘటనకు సంబంధించిన సాక్షులకు రక్షణ కల్పించాలని కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మిగిలిన సాక్షులు వాంగ్మూలాలను జుడీషీయల్ మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయాలని హరీష్ సాల్వేను కోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష సాక్షులు68 మందిలో కేవలం23 మందే ఉండటం పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వందల మంది రైతులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉంటే కేవలం23 మంది ఉండటం ఏంటని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అనంతరం కేసును నవంబర్ 8కి వాయిదా వేసింది.
