TGSRTC JAC: జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాత పూర్వకంగా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి చెప్పామని.. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు.. నిన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు తాజాగా మీడియాతో వెల్లడించారు. వేం నరేందర్రెడ్డి విలీనం చేస్తామని చెప్పారని.. కార్మికులు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వ వైఖరిపై స్పష్టత కరువైందని.. ఈనెల 31న ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జిలు ధరించి నిరసన చేపడతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం విలీనం చేయలేము అని గతంలో ప్రభుత్వం చెప్పిందని.. ఈ మధ్య సమ్మె చేపట్టి ప్రభుత్వానికి కనువిప్పు చేశామని ఆర్టీసీ జేఏసీ వైస్ ఛైర్మెన్ థామస్ రెడ్డి తెలిపారు. “కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న మంత్రి పొన్నం కొన్ని వ్యాఖ్యలు చేశారు.. గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తాం అని అంటే కథ మళ్ళీ మొదటికి తీసుకొచ్చే పని చేస్తున్నారు.. కానీ మేము ఎన్నికలు.. సంఘాలు కాదు కోరుకోనేది.. విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నాం.. పొన్నం వ్యాఖ్యలతో కార్మికుల్లో విస్మయం కలిగిస్తుంది..
కార్మికుల కోసం తిరిగిన సంఘం మాది.. కొన్ని సంఘాలు మాటలు మార్చి కార్మికులను గందరగోళానికి గురి చేస్తున్నారు.. ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.. ఎన్నికలు అవసరం లేదు.. 2న ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం..” అని థామస్ రెడ్డి స్పష్టం చేశారు.
