తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాలకు సహకరిస్తున్న ఆర్థిక నెట్వర్క్పై విరుచుకుపడింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో 11 బృందాలు, 40 మంది అధికారులు పాల్గొని బ్యాంకు శాఖలు, ఏటీఎం కేంద్రాలు, అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
గతంలో నమోదైన సైబర్ కేసుల దర్యాప్తులో అక్రమ డబ్బును తరలించేందుకు సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు అందించడం, విదేశీ ఆపరేటర్లతో కలసి టెలిగ్రామ్ ద్వారా అనధికార గేమింగ్ చెల్లింపులు నడపడం వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాదిస మురళీకృష్ణ, వడ్లమూడి సాయినివాస్లను అరెస్ట్ చేసి, వారు అందించిన 10 మ్యూల్ ఖాతాలను గుర్తించారు. గతంలో 49/2026 కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా, మొత్తంమీద రెండు కేసులకు సంబంధించి ఇప్పటివరకు 52 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
దీనిలో మొత్తం 30 బ్యాంకు శాఖల్లోని 121 మ్యూల్ ఖాతాలు, అధిక ఏటీఎం ఉపసంహరణలు జరిగిన 273 ఖాతాలు, చెక్ విత్డ్రాయల్స్ ఉన్న 12 ఖాతాలతో పాటు 25 అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా సైబర్ కేసులతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీటి ద్వారా రూ. 7.84 కోట్ల లావాదేవీలు జరగ్గా, అందులో రూ. 6.23 కోట్లు వివాదాస్పదమైనవిగా నిర్ధారించారు.
ప్రస్తుతం 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. గత ఫిబ్రవరి 2026లోని ‘ఆపరేషన్ కాక్డౌన్ 1.0’లో కూడా 75 మ్యూల్ ఖాతాలను గుర్తించి 25 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో వ్యాపారులు, కూలీలు, నిరుద్యోగులతో పాటు మాజీ సీఎస్బీ బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉన్నారు. కేవలం కమీషన్ ఆశ చూపి ఎవరైనా అడిగితే బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, పిన్, ఓటీపీ వంటి వివరాలు ఇతరులకు ఇవ్వరాదని టీజీసీఎస్బీ స్పష్టం చేసింది. సైబర్ నేరాలకు దుర్వినియోగమయ్యే ఖాతాదారులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

