Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..

Uttam

Uttam

ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ చరిత్రలోనే కాకుండా, దేశంలోనే రికార్డు స్థాయిలో పంట పండిందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ధాన్యం తరలింపు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల కోసం సివిల్ సప్లై శాఖకు ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల ఆర్థిక వనరులను కల్పించిందని, అందులో ఇప్పటికే 4,800 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి వివరించారు. వరి రెండు పంటలకు కలిపి రైతులకు సుమారు 45 వేల కోట్ల రూపాయలు అందుతున్నాయని పేర్కొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌లో తెలంగాణ సాధించిన స్థాయిలో కొనుగోళ్లు మరెక్కడా జరగలేదని ఆయన గుర్తు చేశారు.

ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్ల విషయంలో మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం తూకంలో గానీ, మరే ఇతర కారణాలతో గానీ మిల్లర్లు కటింగ్ పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కూడా సకాలంలో చేరుకుంటున్నామని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.