Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్‌.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..

Tg Ration Health Cards

Tg Ration Health Cards

Telangana Ration Cards: తెలంగాణలో నూతన పీడీఎస్ (PDS) రేషన్ కార్డుల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం తుది ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నూతన అర్హులకు ఆహార భద్రతను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.05 కోట్ల కొత్త, ల్యామినేటెడ్ రేషన్ కార్డులను అర్హులకు అందించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమాలు సాగుతాయి.

కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రతి నియోజకవర్గంలో పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం ఆర్డీవోల (RDO)కు అప్పగించింది. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ వేడుకలు జరగనున్నాయి. కార్డుల సేకరణకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదికల వద్ద మౌలిక వసతులు, తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ పూర్తయిన వెంటనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.