NTV Telugu Site icon

Bhatti Vikramarka: ప్రజలపై పన్నుల భారం మోపం

Batti

Batti

ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమ‌లుకు, ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీ గురించి కావాల్సిన నిధుల‌ను స‌మ‌కూరుస్తున్నామన్నారు. రాష్ట్రం స‌మ‌గ్రంగా అభివృద్ధి చెందాల‌ని కోరుకునే వాళ్లం.. ఒక ప్రాంతం, ఏరియా అభివృద్ధి కావాల‌ని కోరుకునే వాళ్లం కాదని భట్టి స్పష్టం చేశారు.

దళిత బంధుకు ఒక్క పైసా ఇవ్వలేదు..
గత ప్రభుత్వం దళిత బంధుకు రూ.17,700 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా విడుద‌ల చేయ‌లేదన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం కోసం విధి విధానాల రూపకల్పన చేస్తున్నామని.. మార్గదర్శకాలు పూర్తి కాగానే నిధుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధ‌న్యత ఇస్తుందన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణ‌మే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప‌ని చేస్తుందని భట్టి పేర్కొన్నారు.

కక్కులపై చర్యలు
జాబ్ క్యాలెండ‌ర్ ప్రక్రియ‌కు కావాల్సిన నిధులు విడుద‌ల చేస్తామన్నారు. కొన్ని రోజుల్లోనే నోటిఫికేష‌న్ ప్రక్రియ మొద‌లవుతుందని… ప్రతి సంవ‌త్సరం జాబ్ క్యాలెండ‌ర్‌ను పాటిస్తామని హామీ ఇచ్చారు. మ‌నుషులపై కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని.. దీనిని అరిక‌ట్టడానికి చ‌ర్యలు తీసుకుంటున్నామన్నారు. వెట‌ర్నరీ అధికారుల‌తో యాక్షన్ ప్లాన్ త‌యారు చేయిస్తామని వెల్లడించారు.

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు శుభవార్త
డబుల్ బెడ్రూమ్ అలాట్‌మెంట్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి వెల్లడించారు. పేరుకుపోయిన గ‌త బకాయిలను ఆర్థిక శాఖ‌ క్లియ‌రెన్స్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పాత బ‌స్తీలో మూడు ఫ్లై ఓవ‌ర్ల నిర్మాణం కూడా త్వరగా పూర్తయ్యే విధంగా చ‌ర్యలు తీసుకుంటామన్నారు.

ధ‌ర‌ణి గుది బండ‌..
రాష్ట్రానికి ధ‌ర‌ణి గుది బండ‌గా మారిందని.. దీనిని స‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. అలాగే రెవెన్యూ వ్యవ‌స్థను కూడా నాశ‌నం చేశారని… ప్రక్షాళ‌న చేసి స‌రి చేయ‌డానికి క‌మిటీ వేశామని చెప్పారు. క‌మిటీ నుంచి నివేదిక వ‌చ్చిన త‌ర్వాత చ‌ర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ధ‌నిక రాష్ట్రంలో 10 సంవ‌త్సరాలుగా ల‌క్షల కోట్ల రూపాయ‌లు బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టామ‌ని గొప్పలు చెప్పుకున్నారు.. మ‌రీ 2018 నుంచి విద్యార్థుల ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ఎందుకు క్లియ‌ర్ చేయలేదని భట్టి నిలదీశారు.