Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..

Telangana Rains

Telangana Rains

తెలంగాణలో రాగల కొన్ని గంటల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మంచిర్యాల, నిర్మల్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.

రాజధాని హైదరాబాద్ నగరం విషయానికి వస్తే.. పగటిపూట ఆకాశం పాక్షికంగా మబ్బు పట్టి ఉండి, అక్కడక్కడ మోస్తరు చినుకులు పడే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత నగరంలో వాతావరణం పూర్తిగా మారిపోయి, పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఈదురుగాలులు వీచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది. దీనివల్ల సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్లాన్లను దానికి అనుగుణంగా మార్చుకోవాలని అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప సాయంత్రం పూట బయటకు రావద్దని, జీహెచ్‌ఎంసీ మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు ఇప్పటికే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నాయని తెలిపాయి.