రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దాంతో పదేళ్ల తర్వాత పేదల కల నెరవేరబోతోంది. ఒకే రోజు లక్ష రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మార్చి 8 తర్వాత అందించనుంది. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే.