గవర్నర్‌ సంచలనం.. విమోచన దినం అంటూ ట్వీట్‌..

తెలంగాణలో సెప్టెంబర్‌ 17వ తేదీ విలీనమా..? విమోచనమా? అనే చర్చ సాగుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తుంటే.. ప్రతిపక్ష బీజేపీ మాత్రం విమోచన దినంగా పాటిస్తోంది.. ఈ తరుణంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన గవర్నర్‌ తమిళిసై.. “సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.” అంటూ ట్వీట్‌ చేశారు. సెప్టెంబర్‌ 17పై వివాదం జరుగుతోన్న సమయంలో.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ విమోచనం అంటూ ట్వీట్‌ చేయడం సంచలనంగా మారింది. మరి.. ఈ ట్వీట్‌పై అధికారపక్షం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.