తెలంగాణ ప్రభుత్వం శాసనసభ , శాసన మండలిలో ప్రభుత్వ విప్ల నియామకానికి సంబంధించిన కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నియామకాలు మార్చి 18 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను తెలంగాణ గెజిట్లో ప్రత్యేక సంచికగా ప్రచురించాలని కూడా సూచించారు.
అసెంబ్లీలో 3గ్గురు, కౌన్సిల్లో ఇద్దరు..
తెలంగాణ శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్లుగా నియమించారు. వారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామణరావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వీరు సభలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారాలు సజావుగా సాగేందుకు బాధ్యతలు నిర్వహిస్తారు.
అదేవిధంగా.. తెలంగాణ శాసన మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రభుత్వ విప్లుగా నియమించారు. వారు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్. మండలిలో కూడా ప్రభుత్వ పనితీరు సక్రమంగా కొనసాగేందుకు వీరు కీలక పాత్ర పోషిస్తారు.
ఈ నియామకాల ద్వారా శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని అధికారులు భావిస్తున్నారు. సంబంధిత శాఖలు, అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
