తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు సంబంధించి క్వింటాకు 500 రూపాయల బోనస్ పథకంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా విధించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర అయోమయాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.
ఈ బోనస్ సొమ్ము అందాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్దేశించిన 7 రకాల సన్న వరి విత్తనాలను మాత్రమే సాగు చేసి ఉండాలి. అందులో ఆర్ఎస్ఆర్ 15048 (తెలంగాణ సోనా), కేఎన్ఎం 1638 (కూనారం వరి-2), జైశ్రీరామ్, కేఎన్ఎం 7715, బీపీటీ 5204 (సాంబమసూరు), హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి) రకాలు ఉన్నాయి. రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణాలకు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్పుస్తకం, కొనుగోలు బిల్లు సమర్పించి సెప్టెంబర్ 10వ తేదీలోగా తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు.
నెల రోజుల కిందటే విత్తనాలు కొనుగోలు చేసినందున ఇప్పుడు పాత బిల్లులు దొరకక, దుకాణాల చుట్టూ తిరగలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల వ్యాపారుల వద్ద రికార్డులు లేకపోవడంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి. మరోవైపు మార్కెట్లో లభించే ఇతర రకాల సన్న వరిని సాగు చేసిన రైతులు తమకు బోనస్ వర్తించకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకుని సాగు చేసిన రైతులు కూడా ఏ దుకాణంలో నమోదు చేసుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఈ సమస్యపై స్పందించిన జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. సొంత విత్తనాలు వాడిన రైతులు దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, స్థానిక వ్యవసాయ అధికారులకు సొంత డిక్లరేషన్ (Self-Declaration) రాసి ఇస్తే సరిపోతుందని తెలిపారు. సెప్టెంబర్ 10 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోనే దాదాపు 2.51 లక్షల ఎకరాల్లో సన్న రకాలు సాగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలను మరింత సులభతరం చేయాలని రైతాంగం కోరుతోంది.

