Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం

Yadagirigutta Giri Pradakshana

Yadagirigutta Giri Pradakshana

Telangana Temples Revenue: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక వైభవంతో పాటు సరికొత్త ఆర్థిక రికార్డులను సృష్టిస్తున్నాయి. దేవాదాయ శాఖ తాజాగా విడుదల చేసిన 2025-26 ఆర్థిక సంవత్సరపు అంచనా నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ఖజానాకు మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఆదాయం వచ్చి చేరింది. భక్తుల రద్దీ పెరగడంతో పాటు గత రికార్డులన్నీ బద్దలవుతూ ఆలయాల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. దర్శన టిక్కెట్ల విక్రయం, హుండీ కానుకలు, లడ్డూ ప్రసాదాల అమ్మకాలు, వివిధ సేవల ద్వారా ఈ భారీ ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 689 దేవాలయాల ద్వారా మొత్తం రూ.556.11 కోట్లపైగా రాబడి రావడం విశేషం.

ఆలయాల ఖజానా ఈ స్థాయిలో కళకళలాడటానికి సామాజిక, పరిపాలనాపరమైన కొన్ని కీలక మార్పులు దోహదం చేశాయి. అంతేకాదు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యంతో గ్రామీణ ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రాలకు తరలివస్తున్నారు. బస్సు ఛార్జీల రూపంలో మిగిలిన డబ్బును భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించడం, ప్రత్యేక పూజలు, ప్రసాదాల కోసం ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో క్యూ లైన్లు, విశ్రాంతి గదులు, అన్నదాన భవనాలు, పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడం వల్ల భక్తుల తాకిడి పెరిగింది. అభిషేకాలు, కల్యాణోత్సవాలు, అర్జిత సేవల టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా సులువుగా బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రావడం కూడా ఆదాయ వృద్ధికి కలిసొచ్చింది. రాష్ట్రంలోని దేవాలయాలను వాటి వార్షిక ఆదాయాన్ని బట్టి మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఇందులో కేవలం రెండు ఆలయాలు మాత్రమే రూ.50 కోట్ల మార్కును దాటి అగ్రస్థానంలో నిలిచాయి.

ఇక, స్వయంభూ క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం రూ. 93.87 కోట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పునర్నిర్మాణం తర్వాత ఇది అద్భుతమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారి వంద కోట్ల మార్కుకు చేరువైంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం రూ. 73.43 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. తర్వాత భద్రాచలం రామయ్య (రూ. 31.3 కోట్లు), కొండగట్టు అంజన్న (రూ. 21.9 కోట్లు), కొమురవెల్లి మల్లన్న (రూ. 20.9 కోట్లు), బాసర సరస్వతీ దేవి (రూ. 17.8 కోట్లు), బల్కంపేట ఎల్లమ్మ (రూ. 12.5 కోట్లు), జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి (రూ. 12.2 కోట్లు) ఈ జాబితాలో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 346 ఆలయాలు ఈ పరిధిలోకి వచ్చాయి. వీటిలో చెరువుగట్టు (రూ. 9.1 కోట్లు), కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం (రూ. 8.7 కోట్లు), వరంగల్ భద్రకాళి (రూ. 8.3 కోట్లు), ఏడుపాయల దుర్గమ్మ (రూ. 7.2 కోట్లు) ప్రధానంగా ఉన్నాయి.

ఆదాయం వివరాలు రూపాయల్లో..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి: రూ. 93,87,26,189
వేములవాడ రాజరాజేశ్వర స్వామి: రూ. 73,43,45,261
భద్రాచలం సీతారామచంద్ర స్వామి: రూ. 31,34,12,128
కొండగట్టు ఆంజనేయ స్వామి: రూ. 21,98,08,546
కొమురవెల్లి మల్లికార్జున స్వామి: రూ. 20,97,93,968
బాసర జ్ఞాన సరస్వతీదేవి: రూ. 17,82,33,280
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం: రూ. 12,54,50,614
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం: రూ. 12,20,83,854
చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి: రూ. 9,14,61,760
కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం: రూ. 8,73,46,112