CM Revanth Reddy: ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుందని, ఇప్పటి వరకు 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, మెగా డీఎస్సీ నియామకాలను విజయవంతంగా నిర్వహించి నియామక పత్రాలు అందించామని తెలిపారు. యువతకు నైపుణ్యం, ఉద్యోగాలు కల్పించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అప్గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ అకాడమీ, యంగ్ ఇండియా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే తెలంగాణ వేదికగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ 2026 నిర్వహించబోతున్నామని చెప్పారు.
వైద్యరంగంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, నిమ్స్లో 2,000 పడకల నూతన ఆసుపత్రి నిర్మాణంతో పాటు వరంగల్, సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని తెలిపారు. కొత్తగా 8 మెడికల్ కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ కళాశాలలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే తొలి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ నిర్వహణ ఇందుకు నిదర్శనమని, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5.18 లక్షల మందికి రూ.2,526 కోట్ల సాయం అందించామని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు సరికొత్త సాంకేతికత, వనరులను అందిస్తున్నామని సీఎం చెప్పారు. సైబర్ నేరాలు, ఆహార కల్తీని ఎదుర్కొనేందుకు డ్రగ్స్ కంట్రోల్, సైబర్, ఆహార కల్తీ నియంత్రణలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్పై ప్రమాదాలు తగ్గించేందుకు హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్లు, మహిళల భద్రతకు షీ టీమ్స్, పిల్లల అనుకూల న్యాయస్థానాల ఏర్పాటులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల శ్రద్ధతో నిర్ణయాలు తీసుకుంటున్నామని, పీఆర్సీ, పెన్షన్లు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వంటివి అమలు చేస్తున్నామని తెలిపారు. 36 సచివాలయ శాఖల్లో 100 శాతం ఈ-ఆఫీస్ అమలు చేశామని, ఈ నెల 17వ తేదీ నుండి అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ‘ప్రజావాణి’ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.
హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, చెరువుల పరిరక్షణకు ‘హైడ్రా’ ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామని సీఎం వివరించారు. పారిశ్రామికంగా టి-ఐడియా ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు, తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్ల ఒప్పందాలు సాధించామని, 2025-26లో ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. తొలి సమగ్ర టూరిజం పాలసీ 2025 తీసుకువచ్చామని, సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్-2047’ దిశగా అడుగులు వేస్తున్నామని, అందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని సీఎం ప్రసంగాన్ని ముగించారు.

