N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్

Bjp Ramchander Rao

Bjp Ramchander Rao

N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ పోరాటం కొనసాగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో కాలేజీలకు వెళ్లి 5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించామని తెలిపారు. “మా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మాకివ్వండి” అంటూ విద్యార్థులు స్వయంగా సంతకాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ‘ఫీజు బకాయి-బీజేపీ లడాయి’ పేరుతో బీజేపీ దీక్ష చేపట్టిన సందర్భంగా సోమవారం రాంచందర్‌ రావు మీడియాతో మాట్లాడారు. ఫీజు బకాయిల కోసం విద్యార్థులు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తే.. వారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒక్కటే కాదు.. తెలంగాణలో యావత్ విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖను నిర్వహిస్తున్నారు.. అయినా విద్యా వ్యవస్థను గాలికొదిలేశారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి రూ.1,000 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.. కానీ ఇప్పటివరకు రూ.1,000 కూడా ఇవ్వలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్లు పెంచి మొత్తం బకాయిలను రూ.12 వేల కోట్లకు చేర్చిందని తెలిపారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని.. దీనికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయని.. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ తెలిపారు. “యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో వచ్చే సంవత్సరానికి అడ్వాన్స్‌గా రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల కోసం పోరాడితే వారిపై లాఠీచార్జ్ చేయించి, పోలీసులతో దురుసుగా వ్యవహరింపజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయుష్, హోమియోపతి విద్యార్థులు స్టైఫండ్ల కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారి నిరసనలో నేను స్వయంగా పాల్గొన్నాను. రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి.. ఇక్కడి విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సమాధానం చెప్పాలి. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? స్కాలర్‌షిప్‌లు ఎందుకు అందడం లేదు? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు. ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి!” అంటూ వ్యాఖ్యానించారు.