తెలంగాణ శాసనసభలో వస్తు సేవల పన్ను (GST) చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుపై విస్తృత చర్చ జరిగిన అనంతరం, సభ ఏకగ్రీవంగా దీనిని ఆమోదించింది. ప్రధానంగా పన్నుల విభాగంలోని ఉన్నతాధికారుల హోదాలను పునర్వ్యవస్థీకరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పులను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న ‘సేల్స్ టాక్స్ కమిషనర్’ పోస్టు పేరును ఇకపై ‘చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్’గా మార్చారు. అలాగే.. అదనపు కమిషనర్ (గ్రేడ్-1) హోదాను ‘స్టేట్ టాక్స్ కమిషనర్’గా మారుస్తూ చట్ట సవరణ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలలోని ఉన్నతాధికారుల హోదాలతో తెలంగాణ అధికారుల హోదాలను సమన్వయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Also Read:PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ మార్పుల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక భారం గానీ, నష్టం గానీ ఉండదని స్పష్టం చేశారు. కేవలం పరిపాలనాపరమైన సౌలభ్యం, మెరుగైన కమ్యూనికేషన్ , సమన్వయం కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారుల హోదాల్లో మార్పులు చేయడం ద్వారా జీఎస్టీ అమలులో ఎదురయ్యే టెక్నాలజీ పరమైన ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి వివరణతో సంతృప్తి చెందిన సభ, చివరగా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
