Team India: టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. అమెరికాతో జరిగిన పోరులో విజయ కేతనం ఎగురవేసింది. ఈ తరుణంలో భారత జట్టుకు కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చాడు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తన ఇంట్లో అందరికీ కలిసి భోజనం ఏర్పాటు చేశాడు. వరల్డ్ కప్ లాంటి ఒత్తిడితో కూడిన టోర్నీలో ఆటగాళ్లు కాస్త రిలాక్స్ కావాలన్నదే గంభీర్ ఆలోచన. ఈ విందులో పాల్గొన్న క్రీడాకారులకు సంబంధించిన వీడియోలను ఏఎన్ఐ విడుదల చేసింది. ఈ వీడియోల్లో గంభీర్ తన ఇంటికి రావడం అతడి వెంట బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ సహా సపోర్ట్ స్టాఫ్ రావడం కనిపించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం ఈ విందుకు హాజరయ్యారు. ఇది కేవలం డిన్నర్ మాత్రమే కాదు.. జట్టును కుటుంబంలా దగ్గర చేయాలనే గంభీర్ ప్రయత్నంగా చెబుతున్నారు. ఇలా గంభీర్ విందు ఇవ్వడం మొదటిసారి కాదు. గతంలోనూ భారత జట్టు ఢిల్లీకి వచ్చినప్పుడు, వెస్టిండీస్తో రెండో టెస్ట్ ఆడిన సమయంలో పలుమార్లు గంభీర్ ఇలానే తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. ఆటగాళ్ల మధ్య అనుబంధం పెరగాలన్నదే కోచ్ లక్ష్యం.
READ MORE: Sanae Takaichi: జపాన్లో ఐరన్ లేడీ సనాయే తకైచి చారిత్రాత్మక విజయం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
ఈ డిన్నర్కు ముందు భారత్ ఓ కష్టమైన మ్యాచ్ నుంచి బయటపడింది. ముంబై వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 29 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఆ విజయం అంత ఈజీగా రాలేదు. టాప్ ఆర్డర్ పూర్తిగా కూలిపోయి, 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన పరిస్థితిలో జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. అలాంటి వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా పోరాడాడు. తన హోమ్ గ్రౌండ్ వాంఖడేలో పరిస్థితిని చక్కబెట్టాడు. 49 బంతుల్లో నాటౌట్గా 84 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఒక దశలో భారత్ 18 ఓవర్లకు 128/7గా ఉండగా, చివరికి 161/9 వరకు తీసుకెళ్లాడు. ఆ ఇన్నింగ్స్ నిజంగా ఒత్తిడిలో ఎలా ఆడాలో చూపించింది. బౌలింగ్లోనూ భారత్కు ఊరట లభించింది. జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా జట్టుకు దూరంగా ఉండడంతో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్ మంచి ప్రభావం చూపించాడు. నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. డీఎస్పీ దాడికి అమెరికా నాలుగో ఓవర్కే కుప్పకూలింది. ఆ దశలోనే మ్యాచ్ భారత్ వైపునకు తిరిగిపోయింది. ఎట్టకేలకు తొలి మ్యాచ్లో భారత్ విజయ కేతనం ఎగురవేసింది.