Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Tcs Nashik Case

Tcs Nashik Case

Nashik TCS Harassment Case: నాసిక్‌లో సంచలనం సృష్టించిన టీసీఎస్ (TCS) లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి కేసులో తాజాగా దాఖలైన చార్జ్‌షీట్ పలు షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చింది. నిందితులు కేవలం మతమార్పిడికే పరిమితం కాకుండా, బాధితురాలి పేరు మార్చి కొత్త గుర్తింపు ఇవ్వాలని, ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచాలని పక్కాగా ప్లాన్ చేశారు. మలేగావ్‌కు చెందిన ఒక టీమ్ ద్వారా మతమార్పిడికి సంబంధించిన నకిలీ పత్రాలను సిద్ధం చేయవచ్చని నిందితుడు తౌసిఫ్ చెప్పడంతో బాధితురాలు తన విద్యా, ఇతర అసలు పత్రాలను నిందితుడు డానిష్ బ్యాగ్‌లో పెట్టింది. ఒకవేళ ఇంట్లో తెలిస్తే ఎలా అని బాధితురాలు ఆందోళన చెందగా.. కొత్త పేరుతో డాక్యుమెంట్లు వచ్చాక ఉద్యోగం నిమిత్తం రెండేళ్లు బయటకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి, ముంబైకి మారిపోయి కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉండాలని డానిష్ సలహా ఇచ్చాడు. పరిస్థితి విషమిస్తే ఆమెను మలేషియా పంపేందుకు సైతం నిందితుడు తౌసిఫ్ ప్రతిపాదించాడు, అక్కడ తన బంధువుల ఇంట్లో ఉంటూ ఇస్లాం పద్ధతులు పాటిస్తూ, ఇక్కడి వారితో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఉండాలని ప్లాన్ చేశారు.

కాగా, ఫిబ్రవరి 2026లో బాధితురాలికి ఒక అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ రావడంతో, డానిష్‌ను గట్టిగా నిలదీయగా.. తనకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారనే నిజాన్ని ఒప్పుకున్నాడు. నిజం చెబితే వదిలేస్తావనే భయంతోనే ఇన్నాళ్లూ దాచానని చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. ఆ తర్వాత డానిష్ తన భార్య మాహిరిన్‌తో మాట్లాడించగా, ఆమె బాధితురాలిని కలిసి ఇస్లాం పద్ధతుల గురించి చెబుతానని పేర్కొంది. కానీ బాధితురాలు నిరాకరించింది. అయితే, తన కొత్త పేరు, గుర్తింపు అప్పటికే కొందరికి తెలియడంతో దీని వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం ఆమెకు బలపడింది. పెళ్లయిన నీతో నా పెళ్లెలా సాధ్యమని బాధితురాలు ప్రశ్నించగా, తమ సమాజంలో బహుభార్యత్వం ఉందంటూ.. ఎవరూ దొరక్కపోతే తమ ‘ఇమామ్ సాబ్’ను పెళ్లి చేసుకోవచ్చని డానిష్ చెప్పాడు. ఆ ఇమామ్ భార్య మదర్సాలో చదువు చెబుతుందని, ఆమె ద్వారా ఇస్లాం, అరబిక్ నేర్చుకోవచ్చని వివరించాడు. ఇక, గత చార్జ్‌షీట్‌లోనూ మానసిక ఒత్తిడి తగ్గిస్తామనే నెపంతో తనకు మతపరమైన వీడియోలు, సాహిత్యాన్ని చూపించి ప్రభావితం చేశారని, డానిష్ పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఇప్పటికే ఆరోపించింది. ప్రస్తుతం నాసిక్‌లోని దేవ్లాలీ క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, నిదా ఖాన్‌లపై నమోదైన ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది. 100 మందికి పైగా సాక్షుల స్టేట్‌మెంట్లతో దాఖలైన ఈ చార్జ్‌షీట్‌లోని ఆరోపణల నిజానిజాలు కోర్టు విచారణ, సాక్ష్యాధారాల పరిశీలన తర్వాతే తేలనున్నాయి.

×
×
Ad