Kallakurichi Hooch Tragedy: తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచి జిల్లాలో కల్తీ సారా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 36కి చేరుకుంది. ఇంకా పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మిథనాల్ కలిపి కల్తీ సారా విక్రయిస్తున్న వ్యక్తిని, అతడి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Sonakshi Sinha Marriage: కామూష్.. సోనాక్షి సిన్హా పెళ్లిపై స్పందించిన శతృఘ్న!
కాగా, ఇటీవల కల్లకురిచి పట్టణ పరిధిలోని కరుణాపురంలో అక్రమంగా విక్రయిస్తున్న కల్తీ సారాను రోజువారీ కూలీలతో కూడిన బృందం తాగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత వారిలో ఎక్కువ మంది తలతిరగడం, తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్లలో చికాకు లాంటి సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కొందరిని మెరుగైన చికిత్స కోసం పాండిచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జీప్మెర్)కు రెఫర్ చేయగా.. మిగతా వారిని కల్లకురిచి, సేలం, విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రులలో దాదాపు 75 మంది వరకు చికిత్స పొందుతుండగా మృతుల సంఖ్య 36కి చేరింది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు.
Read Also: Chiranjeevi : ‘పరువు’ సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్..
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ అంశంపై సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రావణ్కుమార్ బదిలీ చేయగా.. జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాను సస్పెండ్ చేసి కొత్త ఎస్పీగా రజత్ చతుర్వేదిని ప్రభుత్వం నియమించింది. అలాగే జిల్లాలోని పలువురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఇక, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అలాగే, కల్లకురిచిలో ఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. హోం సెక్రటెరీ కల్లకురిచి ఘటనపై స్వయంగా వెళ్ళి విచారణ చేపట్టాలని స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ రాత్రి వరకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.