Site icon NTV Telugu

T20 World Cup: ఫస్ట్ మ్యాచ్‌ గోవింద? పాకిస్థాన్‌కు పొంచి ఉన్న గండం..

Pakistan Boycott

Pakistan Boycott

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభమవుతోంది. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జట్టు ముందే ఒక పెద్ద సమస్యను తెచ్చుకుంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకోవడంతో గ్రూప్ దశలో మిగిలిన ప్రతి మ్యాచ్ పాకిస్థాన్‌కు చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌లా మారాయి. ఫిబ్రవరి 15న భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మైదానంలోకి దిగడం లేదు. దాంతో ఆ మ్యాచ్‌లో భారత్‌కు నేరుగా రెండు పాయింట్లు వెళ్లిపోతాయి. పాకిస్థాన్‌కు మాత్రం ఒక్క పాయింట్ దక్కదు. ఈ నిర్ణయం వల్ల సల్మాన్ ఆగా నాయకత్వంలోని జట్టుపై ఒత్తిడి బాగా పెరిగింది. ఎందుకంటే ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా ఉన్నాయి. టాప్ రెండు జట్లే తదుపరి దశకు వెళ్లాలి. ఇప్పటికే భారత్ మ్యాచ్‌లో ఓటమి ఖాయం కావడంతో, మిగిలిన అన్ని మ్యాచ్‌లు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది.

READ MORE: Ragi Cookies Recipe: బయట కుకీస్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే పిల్లల కోసం క్రిస్పీ, హెల్తీ రాగి బిస్కెట్లు

నేడు పాకిస్థాన్ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఉంది. కానీ ఇక్కడే పాకిస్థాన్‌ను మరో టెన్షన్ మొదలైంది. ఈ మ్యాచ్ జరిగే కొలంబోలో వాతావరణం అస్సలు కలిసి రావడం లేదు. సాధారణంగా ఇది ఎండాకాలమే అయినా, గత వారం రోజులుగా అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం జరిగే మ్యాచ్ సమయంలోనూ వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. స్థానిక వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. మధ్యాహ్నం తర్వాత వర్షం మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఉదయం 11 గంటలకు వర్షం పడే అవకాశం కేవలం 5 శాతం మాత్రమే. కానీ 12 గంటలకు అది 8 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వచ్చేసరికి ఒక్కసారిగా 60 శాతం, 2 గంటల సమయంలో 68 శాతం వరకు వర్షం పడే అవకాశం ఉంది. అంటే మ్యాచ్ సగం సమయంలో వర్షం అడ్డుపడే ప్రమాదం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. 3 గంటలకు కూడా 60 శాతం వర్షం పడే అవకాశం ఉంది. 4 గంటల తర్వాత కాస్త తగ్గినా, అప్పటికి మ్యాచ్ గందరగోళంలో పడే ఛాన్స్ ఉంది. ఇది పాకిస్థాన్‌ను ముప్పుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే టోర్నీకి ముందు ఆడాల్సిన వార్మప్ మ్యాచ్‌లోనూ వర్షం పడింది. ఐర్లాండ్‌తో జరిగిన వారి ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం వల్ల పూర్తిగా రద్దయ్యింది. ఇక ముందు రోజుల్లోనూ వాతావరణం మారే సూచనలు లేవు. మంగళవారం అమెరికాతో జరగాల్సిన రాత్రి మ్యాచ్‌కూ వర్షం ముప్పు ఉందని అంటున్నారు.

READ MORE: Allu-Arjun : హీరో రెమ్యునరేషన్ అంటే ఇలా ఉండాలి! బన్నీ చూపించిన కొత్త దారి

ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే.. భారత్ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల పాకిస్థాన్ నెట్ రన్ రేట్‌కు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫోర్ఫీట్ చేసిన జట్టుకు సున్నా పాయింట్లు వస్తాయి. పైగా ఆ మ్యాచ్‌ను భారీ తేడాతో ఓడినట్టే లెక్కిస్తారు. దాంతో నెట్ రన్ రేట్ పూర్తిగా దెబ్బతింటుంది. చిన్న గ్రూప్ స్టేజ్‌లో ఇది చాలా కీలకంగా మారుతుంది. భారత్ మ్యాచ్ రద్దవ్వడం వల్ల పాకిస్థాన్‌కు ఎలాంటి బఫర్ లేదు. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయినా, లేదా అమెరికా లాంటి జట్టుతో అనుకోకుండా ఓడినా, పాకిస్థాన్ ప్రయాణం అక్కడితో ముగిసినట్టే. లెక్కల ప్రకారం చూస్తే.. ఒక్క తప్పు చేసే ఛాన్స్ కూడా పాకిస్థాన్‌కు లేదు. చిన్నపాటి తప్పటడుగు వేసిన మూటా ముల్య సర్దుకుని ఇంటికి పయనమవ్వాల్సిందే. ఇప్పుడు అర్హత సాధించాలంటే పాకిస్థాన్ మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవడమే కాదు, పెద్ద తేడాలతో గెలవాలి. అలా చేస్తేనే నెట్ రన్ రేట్‌లో వచ్చిన నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవచ్చు. కానీ వర్షాలు, చిన్న జట్ల నుంచి వచ్చే షాకులు పాకిస్థాన్‌ను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. మొత్తానికి, భారత్ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం పాకిస్థాన్‌కు తామే తాముగా వేసుకున్న ఉచ్చులా మారింది.

Exit mobile version