T20 World Cup 2026: రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ షురూ కానుంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. టీ20 ప్రపంచకప్ 2026 చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది. ఒకవైపు తాము భారత్తో ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంటే.. మరోవైపు తెర వెనుక మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీ ముందు కొన్ని షరతులు పెట్టి తన నిర్ణయాన్ని మళ్లీ ఆలోచించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ను పాకిస్థాన్ ఆడదని ఇప్పటికే ప్రధాని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ ఐసీసీ–పీసీబీ మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఐసీసీ తరఫున డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఈ చర్చలను ముందుకు తీసుకెళ్తున్నారని కథనాలు చెబుతున్నాయి.
READ MORE: Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్కి స్టార్ బౌలర్ దూరం
ఈ మ్యాచ్ను బహిష్కరించడం పాకిస్థాన్ అంత ఈజీ కాదు. మ్యాచ్ ఆడకపోతే భారీ ఆర్థిక జరిమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాదు, శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం పాకిస్థాన్కు లేఖ రాసింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించమని శ్రీలంక కోరింది. వాస్తవానికి.. ఈ మ్యాచ్ శ్రీలంక కొలంబోలో జరగాల్సి ఉంది. టికెట్ ఆదాయం, హోటల్ తదితర రెవెన్యూ ఈ మ్యాచ్కు అధికంగా వసూలవుతుందని శ్రీలంక భావించింది. పాక్ నిర్ణయంతో శ్రీలంక చాలా నష్టపోతుంది. మరోవైపు.. గందరగోళం మధ్యలో మాజీ భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఎప్పుడైనా యూ-టర్న్ తీసుకోవచ్చని అన్నారు. అయితే వాళ్లు ఆడేందుకు ఒప్పుకున్నా.. భారత్కు పోటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్ భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా పాకిస్థాన్ తన మాట మీద నిలబడుతుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
