Ramdev Baba: ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..

Baba Ramdev

Baba Ramdev

దేశంలో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే కోట్లాది మంది నిరుద్యోగ యువతకు నిరాశే ఎదురవుతోంది. చదువు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న యువతకు విద్యా వ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీలు, నియామకాలలో జరుగుతున్న అక్రమాలు పెద్ద శాపంగా మారాయి. అర్హత, ప్రతిభ ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం దక్కక లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలలు, ఆలస్యమవుతున్న నియామక ప్రక్రియలు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఉద్యోగం సాధించి తమ కుటుంబాలను ఆదుకోవాలనుకునే నిరుద్యోగుల ఆవేదన, వారి హక్కుల కోసం చేసే పోరాటాలు ఈనాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో పతంజలి యోగపీఠంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యోగా గురు స్వామి రామ్‌దేవ్ మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో విద్యార్థులు రోడ్డెక్కి చేస్తున్న నిరసనలు విద్యా వ్యవస్థ, ఉద్యోగ నియామకాలలోని తీవ్రమైన సమస్యలకు అద్దం పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, పుస్తకాలు, విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడం వల్లే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, కాపీయింగ్ ఉదంతాలు నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రామ్‌దేవ్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలోనే అత్యధికంగా 90 శాతం వరకు అవినీతి జరుగుతోందని అన్నారు. కులం, సామాజిక వర్గం ఆధారంగా కొందరికి లబ్ధి చేకూరుస్తూ, అసలైన ప్రతిభావంతులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహం పెరిగి మరిన్ని ఆందోళనలకు దారితీయక ముందే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని హెచ్చరించారు. నిరసనల పేరుతో హింస, అరాచకాలను తాను సమర్థించనని, అయితే అవినీతి ఆరోపణలను తేలిగ్గా తీసిపారేయకూడదని ఆయన స్పష్టం చేశారు. అలాగే అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు శత్రువులుగా చూడకుండా పరస్పర గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.