Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?

Stroy

Stroy

ఓవైపు ఎల్‌నినో.. మరోవైపు యుద్ధం సామాన్యుల్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే యుద్ధం దెబ్బకు కుదేలైన మధ్యతరగతికి.. పులి మీట పుట్రలా ఎల్‌నినో వచ్చి పడింది. ఈ రెండింటి కారణంగా రూపాయి విలువ తగ్గుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. తద్వారా కొనుగోలు శక్తి తగ్గుతోంది. ఏతావాతా మధ్యతరగతికి రాబోయేది గడ్డురోజులేననే సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే చిక్కులు తప్పని దుస్థితి. అందుబాటులో ఉన్న వనరుల్ని, చేతిలో ఉన్న డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇరాన్ యుద్ధం ఆగే ప్రసక్తే లేదని తేలిపోవడంతో.. నిరాశలో మునిగిన ప్రపంచానికి.. ఎల్‌నినో ప్రభావం ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఇప్పటికే మన దేశంలో ఎల్‌నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతంలో ఎన్నో సంక్షోభాల నుంచి దేశాన్ని బయటపడేసిన వ్యవసాయ రంగమే.. ఇప్పుడు ఎల్‌నినోతో సంక్షోభంలోకి వెళ్లే దుస్థితి నెలకొనడంతో.. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఏ ముహూర్తాన కరోనా వచ్చిందో కానీ.. అప్పట్నుంచీ ప్రపంచం కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టక ముందే.. ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. అది కొనసాగుతుండగానే ఇరాన్ యుద్ధం వచ్చి పడింది. ఈ యుద్ధం ఆగినట్టే ఆగి.. మళ్లీ తీవ్ర రూపం తీసుకుంటున్న తరుణంలో.. ఎల్‌నినోతో మిగిలి ఉన్న కాస్త ఆశలు కూడా ఆవిరయ్యే దుస్థితి వచ్చేసింది. ఓవైపు యుద్ధం.. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో మధ్యతరగతికి మరిన్ని కష్టాలు తప్పవని తేలిపోయింది. యుద్ధం కారణంగా ఇంధన, సరఫరా సమస్యలు వచ్చి.. ధరలు పెరిగి.. ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ఆర్థిక సంక్షోభం వచ్చేసింది. కాకపోతే ఆర్థిక సమస్యలు వచ్చినా.. వ్యవసాయం బాగుంటే ఏదోలా నెట్టుకురావచ్చనుకున్న సామాన్యుడి ఆశలపై ఎల్‌నినో నీళ్లు చల్లింది. ఇప్పుడు ఎల్‌నినో కారణంగా వర్షాభావంతో.. సాగువిస్తీర్ణం భారీగా తగ్గింది. కరోనా సమయం నుంచీ ఊహించని పంటల దిగుబడులతో.. ఇతర దేశాలను ఉదారంగా ఆదుకున్నాక కూడా.. మనకు తిండిగింజలకు కొరత రాలేదు. కానీ ఇప్పుడు ఎల్‌నినో ఆ పరిస్థితిని రివర్స్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయం కుదేలై.. పంటల దిగుబడులు తగ్గితే.. ఆహార సమస్య వచ్చి.. అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అప్పుడు అటు ఆర్థికంగా చితికిపోయి.. ఇటు ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో.. సామాన్యులు మరింతగా విలవిల్లాడటం ఖాయమనే అంచనాలు అందర్నీ భయపెడుతున్నాయి. సరే ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా సామాన్యుడే సమిధగా మారుతున్న వాస్తవం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టే ఇప్పుడు ఒకదానిపై ఒకటిగా వచ్చిపడుతున్న సమస్యల ధాటికి.. దేశంలో మధ్యతరగతి ఏమైపోతుందోననే ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే ఆర్థిక సంస్కరణల తర్వాత.. దేశ అభివృద్ధి రథాన్ని ముందు లాగుతోంది మధ్యతరగతే. ఇప్పుడు అలాంటి మధ్యతరగతి నడ్డివిరిగే పరిస్థితులు ఒకదానితర్వాత ఒకటిగా చాలా వేగంగా ఏర్పడుతుండటం.. దీర్ఘకాలిక సంక్షోభాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.

వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు మున్ముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే ఖరీఫ్‌ సాగును ప్రశ్నార్థకం చేసిన ఎల్‌నినో, వచ్చే ఏడాది మార్చి దాకా ఉంటుందని, తద్వారా యాసంగి సాగునూ అది దెబ్బతీసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆగస్టులో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నా.. సెప్టెంబరులో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఇది డిసెంబరు దాకా కొనసాగుతుందని వాతావరణ కేంద్రాలు చెప్పేస్తున్నాయి. జూన్‌లో మొదలైన ఎల్‌నినో ప్రభావం అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో తీవ్రంగా ఉండనుందని.. వచ్చే ఏడాది మార్చి దాకా కొనసాగుతుందని జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం.. ఇన్‌కాయిస్‌ కూడా హెచ్చరించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, వర్షపాతం తగ్గుతుందని విశ్లేషించారు. ఫలితంగా ఎల్‌నినో ప్రభావం కారణంగా అక్టోబరుతో ప్రారంభమై జవవరి దాకా సాగే యాసంగి సాగు పనులూ ప్రశ్నార్థకంగా మారాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అక్కడక్కడ, అప్పుడప్పుడు భారీ వర్షాలు పడ్డా కూడా ఇవి సీజన్‌ మొత్తంపడే అవకాశంలేదని, అన్నదాతలు తొందరపడి నీటి అవసరం ఎక్కువుండే పంటలు వేయొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు పడిపోతాయని, చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని… ఇలాంటి పరిస్థితుల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి, చెరకు లాంటి పంటలు సాగుచేయొద్దని రైతులకు సూచిస్తున్నారు. చిరుధాన్యాలు, నూనెగింజల వంటి ఆరుతడి పంటలు సాగు చేయడం మేలని సూచిస్తున్నారు. బోరుబావుల కింద కూడా వరిసాగు చేయొద్దని ఇప్పటికే శాస్త్రవేత్తలతో పాటు ప్రభుత్వాలు కూడా అన్నదాతల్ని అప్రమత్తం చేశాయి. కూరగాయల పంటలు వేయాలని సూచించాయి. ఎల్‌నినో ప్రభావం పట్టణ ప్రాంతాలపై కూడా పడుతుందని ఆర్థిక, సామాజిక అధ్యయనాల కేంద్రం బాంబు పేల్చింది. ప్రతి రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి సంభవించే ఎల్‌నినో భారీ వర్షాలు, కరవులు, ఉష్ణ ప్రకోపం వంటి వాటిని ప్రేరేపిస్తుంది.

జూన్‌ నెలకు సంబంధించి దేశంలో మొత్తం రుతుపవన వర్షాల లోటు దాదాపు 40శాతంగా నమోదైంది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ వంటి అనేక ప్రాంతాలు 75 నుంచి 85శాతం వరకు లోటును ఎదుర్కొంటున్నాయి. ఈ సంవత్సరం వర్షపాత లోటు 60శాతం వరకు ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ లోటు దేశ వ్యవసాయ రంగాన్ని, భూగర్భ జల నిల్వలను, నదులను, నీటిపారుదలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో 1875-77లో దారుణమైన కరవు సంభవించడానికి ఎల్‌నినోయే కారణం. ఆ కరవు ఇండియా, చైనా, ఈజిప్ట్, మొరాకో, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కొలంబియా, వెనెజువెలా దేశాలపై తీవ్ర ప్రభావం చూపి, అయిదు కోట్లకంటే ఎక్కువమందిని బలిగొంది. భారత్‌లో అప్పుడు సుమారు 56 నుంచి 96 లక్షల మంది మరణించారు. ఇప్పుడు కూడా ఎల్‌నినో కరువుకు దారితీస్తుందనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఎల్​నినో మనదేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు విపరీతంగా పెరుగుతాయి. రిటైల్​ ద్రవ్యోల్బణం, టూవీలర్ల అమ్మకాలు, ట్రాక్టర్ల విక్రయాలు, ఖరీఫ్ నాట్లు, జలాశయాల నీటి నిల్వలు, అగ్రి ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, పరపతి వృద్ధిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సగటు వర్షపాతంలో మైనస్ 10.65 మేర లోటు నమోదవుతుంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఒకశాతం తగ్గుతుంది. ఆహార ఉత్పత్తి నాలుగు శాతం క్షీణిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణం సగటున 60 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. ఎంఎస్​ఎంఈలకు బ్యాంక్ లోన్లు దొరకడం కష్టమవుతుంది.

దేశ మొత్తం స్థూల అదనపు విలువలో వ్యవసాయ రంగం వాటా 18 శాతంగా ఉంది. ఎల్ నినో సంవత్సరాల్లో అగ్రి జీవీఏ వృద్ధి దాదాపు ఆగిపోతుంది. జీవీఏ వృద్ధి రేటు 350 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 0.20 డిగ్రీలే పెరిగినప్పటికీ, కరెంటుకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. సాధారణంగా వర్షాకాలంలో తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. కానీ ఎల్‌నినో కారణంగా ఇప్పుడు జలవిద్యుత్తుకు అవకాశాల్లేకుండా పోయాయి. దీంతో అనివార్యంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచక తప్పదు. కానీ వానాకాలంలో బొగ్గును గనుల నుంచి వెలికితీయడం కూడా కష్టం. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని క్షేత్రస్థాయి ఇబ్బందుల్ని ఎదుర్కుంటూ బొగ్గు వెలికితీయక తప్పదు. అయితే ప్రస్తుతం బొగ్గు నిల్వలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో లేవు. దీంతో అధిక ధర పెట్టి ఇంధన ఎక్స్ఛేంజ్‌ నుంచి కరెంట్ కొనాల్సిన పరిస్థితి. తద్వారా ఆ భారం మళ్లీ అంతిమంగా వినియోగదారులపై బదిలీ అవుతుంది.అప్పుడూ సామాన్యులకు భారం తప్పదు. ఇలా ఎల్‌నినో కారణంగా వచ్చే ప్రతి సమస్యనూ సామాన్యులు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో చవిచూడక తప్పదు.