Stock Market: నేడు భారత స్టాక్ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఎరుపుమయంగా కనపడుతుంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 2,300 పాయింట్లకు పైగా పతనమై 76,520 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 50 కూడా 700 పాయింట్లు నష్టపోయి 23,700 స్థాయికి పడిపోయింది. ఈ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా టాటా స్టీల్, ఎల్ అండ్ టి, ఎస్బీఐ, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ సంస్థల షేర్లు 5 శాతం మేరా పడిపోయాయి. మార్కెట్ ఇలా పేకమేడలా కూలిపోవడానికి ప్రధానంగా కొన్నికారణాలు కనిపిస్తున్నాయి. మరి అవేంటో చూద్దామా..
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధం:
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారనే వార్తలు రావడంతో పరిస్థితులు మరింత విషమించాయి. ఇరాన్ కూడా డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఈ అనిశ్చితి ప్రపంచ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
ముడి చమురు ధర:
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు సరఫరా ఆగిపోతుందనే భయం నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 30 శాతం పెరిగి బ్యారెల్ కు 118 డాలర్ల పైకి చేరింది. 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చమురు ధరలు మళ్లీ 100 డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి.
విదేశీ పెట్టుబడిదారుల (FIIs) ఎగ్జిట్:
విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుండి నిధులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి మొదటి వారంలోనే దాదాపు 16,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించారు. గడిచిన నాలుగు రోజుల్లోనే సుమారు 21,829 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.
పాతాళానికి రూపాయి విలువ:
చమురు ధరల పెరుగుదల భారత రూపాయిపై తీవ్ర ప్రభావం చూపింది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 0.5 శాతం బలహీనపడి చారిత్రాత్మక కనిష్ట స్థాయి 92.19 వద్దకు పడిపోయింది. దిగుమతి ఖర్చులు పెరగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది.
అమెరికా బాండ్ యీల్డ్స్ పెరుగుదల:
అమెరికాలో ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు పెరిగి 4.2 శాతానికి చేరాయి. ప్రభుత్వ బాండ్లలో సురక్షితమైన, ఎక్కువ రాబడి వస్తున్నప్పుడు.. ఇన్వెస్టర్లు రిస్క్ ఎక్కువగా ఉండే స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు.
Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!
అంతర్జాతీయ మార్కెట్ల పతనం:
భారత మార్కెట్ ఒక్కటే కాదు.. ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు కూడా కుప్పకూలాయి. జపాన్ నిక్కీ 6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 8 శాతం మేర నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయానక వాతావరణం భారత మార్కెట్లపై ప్రతిబింబించింది.
ద్రవ్యోల్బణం (Inflation):
యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ముడి చమురు ప్రభావంతో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఫలితంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదు. దీనివల్ల సామాన్యుడి ఈఎంఐలు తగ్గే ఛాన్స్ ఉండదు.