పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారీ, ప్రచురణపై అధికారులతో చర్చించారు. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీ ఓటరు లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారీ, ప్రచురణ కొరకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. 06.09.2024న వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటరు లిస్టులు ఆయా జిల్లాల్లో మండల అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీలలో ప్రచురిస్తారు. ఆ డ్రాఫ్ట్ ఓటరు లిస్టులపై జిల్లా కలెక్టర్లు, మండల అభివృద్ధి అధికారులు 09.09.2024, 10.09.2024 తేదీలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి, మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. వారి సూచనలు, సలహాలు స్వీకరించనున్నారు.
READ MORE: Rajasthan Video: వాషింగ్ మిషన్లో పాము ప్రత్యక్షం.. హడలెత్తిపోయిన కుటుంబ సభ్యులు
ఈ డ్రాఫ్ట్ ఓటరు లిస్టులపై 07.09.2024 తేదీ నుంచి 13.09.2024 తేదీ వరకు సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు/ మండల అభివృద్ధి అధికారులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని 19.09.2024 తేదీలోగా పరిష్కరించనున్నారు. 21.08.2024 తేదీ నాడు వార్డుల వారీ, గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటరు జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీ, మండల పరిషత్ లలో ప్రచురిస్తారు. ఈ ఓటరు లిస్టుల తయారీ ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈనెల 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.
