Sourav Ganguly: మరో కీలక బాధ్యతను చేపట్టనున్న సౌరవ్ గంగూలీ.. దాదా అధికారిక ప్రకటన

Sourav Ganguly

Sourav Ganguly

Sourav Ganguly: భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరో కీలక బాధ్యతను చేపట్టబోతున్నారు. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. కోల్‌కతాలోని గంగూలీ నివాసంలో ఆయనతో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం గంగూలీ మాట్లాడుతూ… త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలను చేపట్టబోతున్నానని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు గంగూలీని టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ఇప్పటికే త్రిపుర సర్కారు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా ప్రకటించారు.

Read Also: Child Marriage: దారుణం.. డబ్బుల కోసం ఏడేళ్ల బాలికతో 38 ఏళ్ల వ్యక్తి పెళ్లి

ఇంకోవైపు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందిస్తూ… తమ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనే తమ ప్రతిపాదనను గంగూలీ అంగీకరించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. గంగూలీ భాగస్వామ్యం కచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని అన్నారు. ఈరోజు గంగూలీతో ఫోన్ ద్వారా మాట్లాడానని చెప్పారు. గంగూలీ ప్రకటనతో దాదా రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ మొదలైంది. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్త రాగానే.. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీంతో దాదా కాషాయ పార్టీలో చేరుతారని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.