TDP vs YS Jagan: ఈవీఎంలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఎక్స్ పోస్ట్ (ట్వీట్)కు కౌంటర్ ఎటాక్కు దిగారు టీడీపీ నేతలు.. జగన్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.. ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు.. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా..? అని నిలదీశారు.. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. పరనింద.. ఆత్మ స్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.
ఇక, జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా..? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతావా..? అంటూ ట్విట్టర్లోనే నిలదీశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. జగన్ పులివెందులకు రాజీనామా చేస్తే.. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టమని అందరం ఈసీని కోరదాం… ఆ ఉప ఎన్నికల్లో అసలు గెలుస్తావో లేదో..? మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, చూద్దాం..! అంటూ సవాల్ చేశారు. ఇకనైనా జగన్ చిలక జోస్యం ఆపాలి అంటూ ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న..
కాగా, ఈవీఎంల విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. ”న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలి. అలాగే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి.. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన విషయం విదితమే.