భారత్ , జింబాబ్వే మధ్య హరారే వేదికగా జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జిమ్బాబ్వే కెప్టెన్ సికందర్ రజా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్లో రజా పరుగులేమీ చేయకుండా సున్నాకే అవుటయ్యాడు. ఈ డకౌట్తో సికందర్ రజా ఖాతాలో ఒక షాకింగ్ , చెత్త రికార్డు నమోదైంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పూర్తి స్థాయి సభ్యత్వ దేశాల కెప్టెన్లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆయన భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్లను వెనక్కి నెట్టేశాడు.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 8 సార్లు సున్నాకే నిష్క్రమించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రజా ఇప్పటివరకు 7 సార్లు డకౌట్ అయి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ తమ కెప్టెన్సీలో చెరో 6 సార్లు సున్నా పరుగులకే అవుటై తదుపరి స్థానాల్లో నిలిచారు. పరుగుల వేటలో కెప్టెన్ స్థానంలో ఉండి నిరాశపరచడం రజాకు, అతని జట్టుకు పెద్ద ప్రతిబంధకంగా మారింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల విద్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు సాధించి, జిమ్బాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో జింబాబ్వే తీవ్రంగా తడబడింది. భారత బౌలర్లు మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసి భారత్కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు.

