Karnataka politics: కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన హై-ప్రొఫైల్ ‘బ్రేక్ఫాస్ట్ మీటింగ్’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లీడర్షిప్ మార్పుపై జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో, ఈ కీలక సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సరిగ్గా పదవి నుంచి తప్పుకునే తరుణంలో.. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఒక ఆసక్తికరమైన, ఎమోషనల్ సీన్ కనిపించింది. తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నడుమ సీఎం నివాసానికి చేరుకున్న డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇడ్లీ, వడ, చౌచౌ బాత్ వడ్డించిన ఈ వీడ్కోలు విందులో శివకుమార్ కాస్త భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై హోంమంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ.. సీఎం పదవికి రాజీనామా చేయడానికి ముందే సిద్ధరామయ్య ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. గత మూడేళ్లుగా తనకు, తన ప్రభుత్వానికి సహకరించిన మంత్రివర్గ సహచరులందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలపడానికే ఈ విందు ఇచ్చారని స్పష్టం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ.. రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన రాజీనామా చేస్తే డి.కె. శివకుమార్కు సీఎం పగ్గాలు అప్పగించేలా లైన్ క్లియర్ కానుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, అలాగే కె.సి. వేణుగోపాల్ బుధవారమే బెంగళూరు చేరుకున్నారు.
అయితే, పార్టీ నష్టనివారణ చర్యల్లో భాగంగా సూర్జేవాలా మాత్రం లీడర్షిప్ మార్పు వార్తలను ఖండించారు. ఇప్పటివరకు కర్ణాటకలో ఎలాంటి శాసనసభా పక్ష (CLP) సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని, అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. కాబట్టి మీడియా తొందరపడి ఎలాంటి తప్పుడు కథనాలు రాయొద్దని కోరారు. అయినప్పటికీ, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య నేరుగా గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించేందుకు సమయం కోరడంతో.. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి రాక ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
