Shoaib Akhtar: టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయ కేతనం ఎగుర వేయడం పాకిస్థాన్లోని కొందరు మాజీ ప్లేయర్స్కు జీర్ణం కావడం లేదు. టీమిండియా సాధించిన గొప్ప విజయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా విమర్శించాడు. భారత ఆధిపత్యం “క్రికెట్ను నాశనం చేసింది” అని వ్యాఖ్యానించాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై ఆధిపత్యం చెలాయించింది. 96 పరుగుల తేడాతో గెలిచి తమ మూడవ T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. చాలా మంది క్రికెట్ నిపుణులు భారత్ను పొగుడు తుంటే షోయబ్ అక్తర్ మాత్రం పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఓ పాకిస్థాన్ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ.. భారత్ను ధనిక పిల్లాడితో పోల్చాడు. “ఒక వీధిలో ఉండే ధనిక పిల్లాడు తన చుట్టుపక్కల ఉన్న పేద పిల్లలందరినీ పిలిచి ‘రండి క్రికెట్ ఆడుకుందాం’ అని చెప్పినట్టుగా ఉంది భారత్ తీరు. ఎనిమిది జట్లలో తమకు నచ్చిన జట్లను ఉంచుకుని, మళ్ళీ మళ్ళీ గెలుస్తూ.. ‘చూడండి మేమే గెలిచాం’ అని చెప్పుకుంటున్నారు. వారు క్రికెట్ను పూర్తిగా దెబ్బతీస్తున్నారు” అని అక్తర్ విమర్శించాడు. అయితే ఫైనల్కు ముందు అక్తర్ మాటలు వేరేలా ఉన్నాయి. భారత్ ఫేవరెట్ అని ఒప్పుకుంటూనే, క్రికెట్ బాగుండాలంటే ఈసారి న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నట్లు అప్పట్లో వ్యాఖ్యానించాడు. గెలిచిన వెంటనే ప్లేట్ మార్చాడు. అంతేకాదు.. టీమిండియా విజయ రహస్యం గురించి చెప్పాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు ఇస్తున్న మద్దతును మెచ్చుకున్నాడు. కష్టకాలంలో ఉన్న ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం వల్లే ఇలాంటి పెద్ద టోర్నీలలో అద్భుత ఫలితాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు.
READ MORE: Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!
మరోవైపు.. పాకిస్థాన్కు చెందిన కొందరు మాజీ ప్లేయర్స్ టీమిండియా అభినందనలు తెలిపారు. పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ మొహమ్మద్ హఫీజ్, సక్లైన్ ముష్తాక్, షాహిద్ అఫ్రిది, సనా మీర్, ఉమర్ గుల్ భారత్ను అభినందించారు. ఈ విజయం వారి దేశీయ నిర్మాణానికి, దేశంలో ఉన్న క్రికెటర్ల రకానికి నిదర్శనమని అన్నారు. భారత్ మూడోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలవడం వెనుక ఆ దేశంలోని పటిష్టమైన దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఉందనడంలో సందేహం లేదని కొనియాడారు. భారత్ నుంచి వస్తున్న అద్భుతమైన ప్లేయర్స్ క్రికెటర్లే ఈ ఘనతకు అసలు కారణమని విశ్లేషించారు. మరోవైపు.. మొదటి నుంచి భారత్పై విషం కక్కుతూ వచ్చిన పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ఈ విజయంపై స్పందించాడు. ఇటీవల భారత్ ఫైనల్లో ఓడిపోతుందని తాను చెప్పిన జోస్యం తప్పని అంగీకరించాడు. ఫైనల్లో టీమ్ ఇండియా తన అద్భుత ప్రదర్శనతో తనను తప్పుగా నిరూపించిందని అమీర్ పేర్కొన్నాడు.
