Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత ‘స్వర్ణం’ కైవసం.!

  • శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో స్వర్ణం
  • మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తొలి వ్యక్తిగత టైటిల్
  • అహ్మదాబాద్‌లో అద్భుత ప్రదర్శన
  • ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సీదాన్‌తో పోరు..
Sheetal Devi

Sheetal Devi

Sheetal Devi: భారత పారా ఆర్చర్, ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో మరోసారి సత్తా చాటింది. అహ్మదాబాద్‌లో నేడు (బుధవారం) జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో ఈ సిరీస్‌లో శీతల్ తన తొలి వ్యక్తిగత టైటిల్‌ను అందుకుంది.

ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సీదాన్‌తో షీటల్‌కు హోరాహోరీ పోరు జరిగింది. నిర్ణీత షూటింగ్‌ అనంతరం ఇద్దరూ 144-144తో సమంగా నిలవడంతో.. విజేతను నిర్ణయించేందుకు షూట్‌ఆఫ్ నిర్వహించారు. అక్కడ శీతల్ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా పర్ఫెక్ట్‌గా 10 పాయింట్లు సాధించింది. సీదాన్ 9 పాయింట్లకే పరిమితం కావడంతో షీటల్ 10-9 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.

అంతకముందు క్వాలిఫికేషన్‌లోనూ శీతల్ అదరగొట్టింది. తన సీజన్‌ బెస్ట్‌ స్కోరు 698 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న సీదాన్ కంటే ఆమె 10 పాయింట్లు ఎక్కువగా సాధించింది. క్వాలిఫికేషన్‌లో టాప్‌లో నిలవడంతో తొలి రౌండ్‌లో షీటల్‌కు బై లభించింది.

మరోవైపు త్వరలో జరగనున్న ఐచి-నగోయా 2026 ఆసియా పారా గేమ్స్ కు ముందు శీతల్ కు ఈ విజయం మంచి బూస్ట్‌గా మారింది. గత ఎడిషన్‌లో హాంగ్‌జౌలో కాంపౌండ్ మహిళల వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో టైటిల్స్ గెలిచిన షీటల్.. ఈసారి కూడా ఆ టైటిల్స్‌ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే టోర్నీలో శీతల్ దేవి, తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని కూడా సాధించింది. కాంస్య పతక పోరులో భారత జోడీ 157-145తో ఇరాక్‌కు చెందిన సారా అల్-హమీద్, అబ్బాస్ కదిమ్ జోడీని ఓడించింది. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత బృందం అద్భుతంగా రాణిస్తుంది. ఇప్పటివరకు మొత్తం 15 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి.

శీతల్ దేవి ఇప్పటికే పారా ఆర్చరీలో ఎన్నో రికార్డులు సృష్టించింది. 2025లో గ్వాంగ్జులో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి చేతులు లేని మహిళగా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జ్నూర్ క్రే గిర్దీని 146-143తో ఓడించింది. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన శీతల్.. రెండు సార్లు ఆసియా పారా గేమ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో కేవలం 17 ఏళ్ల వయసులో మిక్స్‌డ్ టీమ్ కాంస్యం గెలిచి దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన పారాలింపిక్ పతక విజేతగా నిలిచింది. శీతల్ దేవి ప్రతిభకు గుర్తింపుగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రపంచ నెం.1 పారా ఆర్చర్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీతగా ఉన్న శీతల్ తో హ్యుందాయ్ తన ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో భాగంగా పలు మార్కెటింగ్ కార్యక్రమాల కోసం భాగస్వామ్యం కొనసాగించనుంది.