కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విజయనగరలో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ను వెనుక నుంచి అత్యంత వేగంగా ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోగా… మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
విజయనగర జిల్లాలోని టీబీ డ్యామ్ సమీపంలో జాతీయ రహదారి 50పై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న ట్యాంకర్ వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఆ తీవ్రతకు రెండు వాహనాలు వంతెన పైనుంచి కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
బాధితులు హుళిగెమ్మ ఆలయంలో పూజ చేసి ట్రాక్టర్పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది విజయనగర జిల్లా, కుడ్లిగి తాలూకాలోని మారల్యాన్హళ్లి గ్రామానికి చెందినవారు కాగా.. మిగిలిన వారు బళ్లారి జిల్లా, సాండూర్ తాలూకాలోని యశ్వంత్ నగర్, కుడ్లిగి ప్రాంతంలోని అంకామన్నహళ్లి గ్రామానికి చెందినవారని తెలిసింది. ఈ ఘోర ప్రమాదంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
