Arms Theft: మద్రాస్‌ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!

  • సికింద్రాబాద్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌ ప్రాంతంలో..
  • 12 ఆయుధాలు మిస్సింగ్..
  • చోరీకి గురైన వాటిలో 4 ఏకే-47 రైఫిళ్లు, 1 ఇన్సాస్‌ రైఫిల్‌, 6 పిస్టళ్లు...
Guns Theft

Guns Theft

Arms Theft: సికింద్రాబాద్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌ ప్రాంతంలో అత్యాధునిక ఆయుధాలు మాయమవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ కాంపౌండ్‌లోకి చొరబడిన దుండగులు ఆయుధాలు భద్రపరిచే గదికి సంబంధించిన తాళాన్ని పగలగొట్టి 12 ఆయుధాలను అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

సమాచారం ప్రకారం.. చోరీకి గురైన ఆయుధాల్లో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, ఆరు పిస్టళ్లు ఉన్నాయి. వీటితో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి కూడా మాయమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ఆయుధాల చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

మూడంచెల భద్రత..

మద్రాస్‌ రెజిమెంట్‌ ప్రాంతం చుట్టూ ఎత్తైన ప్రహరీతో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతోంది. రెజిమెంట్‌ ప్రాంతంలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా అనుమతి తప్పనిసరి. ఆయుధాలు, మందుగుండు సామగ్రి భద్రపరిచే స్టోర్స్‌ చుట్టూ ప్రత్యేక భద్రత ఉంటుంది. అంతేకాకుండా అత్యాధునిక సీసీ కెమెరాలతో నిత్యం నిఘా కొనసాగుతుంది. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలోకి దుండగులు ఎలా ప్రవేశించారు.? ఆయుధాలు భద్రపరిచిన గది వరకు ఎలా చేరుకున్నారు.? తాళాన్ని ఎలా పగలగొట్టారు.? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.

సీసీ కెమెరాల ఫుటేజీ..

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెజిమెంట్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెజిమెంట్‌లోకి ఇటీవల ఎవరెవరు వచ్చారు.? ఎవరు బయటకు వెళ్లారు.? అనుమతులు ఎవరికి ఉన్నాయి.? అనే వివరాలను సేకరిస్తున్నారు. అలాగే అనుమానితులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఆయుధాల స్టోర్స్‌లో పనిచేసే సిబ్బంది, భద్రతా విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను కూడా క్షుణంగా పరిశీలిస్తున్నారు.

ఒక్కరితో సాధ్యమా?

చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి పరిమాణం దృష్ట్యా ఈ ఘటనలో ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఇన్సాస్‌ రైఫిల్‌, పిస్టళ్లు, మందుగుండు సామగ్రిని తీసుకెళ్లడానికి ఒకరి కంటే ఎక్కువ మంది వచ్చింటారని భావిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఆయుధాలు నిజంగా చోరీకి గురయ్యాయా? లేక ఎక్కడైనా ఇతర ప్రాంతంలో ఉంచి, రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల మిస్సింగ్‌గా గుర్తించారా..? అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయుధాల స్టాక్‌, రికార్డులు, గతంలో జరిగిన ఆడిట్‌ వివరాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.