Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!

Crude Oil

Crude Oil

Saudi Arabia Oil: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడి చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. అంతలోనే ముడి చమురు ధరకు రెక్కలొచ్చి బ్యారెల్ ధర ఏకంగా 100 డాలర్ల మార్కును దాటేసింది. నిన్నటికైతే ఇది 109 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ హోర్ముజ్ జలసంధి నుంచి కాకుండా, ప్రత్యామ్నాయంగా తన పశ్చిమ తీరంలో ఉన్న యంబూ పోర్టుకు చమురు తరలించేందుకు సౌదీ అరేబియా సుమారు 1,200 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను ఉపయోగిస్తూ వచ్చింది. ఈ మార్గం ద్వారానే భారత్ సహా ఆసియా దేశాలకు ఇన్నాళ్లూ చమురు సురక్షితంగా అందుతోంది. అయితే, తాజాగా ఈ కీలకమైన పైప్‌లైన్‌పై డ్రోన్ దాడి జరగడంతో సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ముందు జాగ్రత్త చర్యగా దీనిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారత్‌తో పాటు పలు ఆసియా దేశాల చమురు సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది.

రియాద్, మదీనా ప్రాంతాల్లో గురువారం ఉదయం ఈ దాడులు జరిగాయి. మదీనాకు దక్షిణంగా ఉన్న పైప్‌లైన్ భాగం నుంచి దట్టమైన నల్లటి పొగలు వస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ దాడిలో కొందరు గాయపడటంతో పాటు పైప్‌లైన్‌కు నష్టం వాటిల్లడంతో ప్రసుత్తం అధికారులు నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఏ సంస్థా అధికారికంగా బాధ్యత వహించకపోయినప్పటికీ, ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా గుంపులు క్రియాశీలంగా ఉన్న ఇరాక్ నుంచే ఈ దాడి జరిగిందని బాగ్దాద్, రియాద్ వర్గాలు సూచిస్తున్నాయి. సాధారణంగా ఈ ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ద్వారా రోజుకు 40 నుంచి 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది, ఇది ప్రపంచ మొత్తం చమురు సరఫరాలో దాదాపు 4 నుంచి 5 శాతానికి సమానం. హోర్ముజ్ సంక్షోభంతో ఇప్పటికే చమురు కొరతతో అల్లాడుతున్న ప్రపంచ ఇంధన మార్కెట్‌కు ఈ ప్రత్యామ్నాయ మార్గం మూతపడటం మరో కోలుకోలేని పెద్ద దెబ్బగా మారింది.

ఇక, భారత్‌కు సౌదీ అరేబియా మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముందు అంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో సౌదీ నుంచి భారత్‌కు రోజుకు 7.43 లక్షల బ్యారెళ్ల చమురు రాగా, ఫిబ్రవరి నుంచి ఆగస్టు నాటికి అది 4.40 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. ఈ యుద్ధ ప్రభావంతో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన సౌదీ అరేబియాలో ఉత్పత్తి గత 36 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరగా, ఆగస్టు నెలలో ఎగుమతులు కూడా ఏకంగా 40 శాతం మేర పడిపోయాయి. మనం అవసరమైన చమురులో సింహభాగాన్ని దిగుమతి చేసుకుంటున్నందున, ఈ పైప్‌లైన్ సుదీర్ఘకాలం మూతపడితే భారత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. యంబూ ద్వారా రావాల్సిన సరుకు నిలిచిపోతే, భారత్ ఇతర దూర ప్రాంతాల లేదా సుదీర్ఘ సముద్ర మార్గాల ద్వారా చమురును తెప్పించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల రవాణా, భీమా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలతో పాటు భారత దేశీయ మార్కెట్‌పైనా ఆ భారం నేరుగా పడే అవకాశముంది.