మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తిని మండల కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 37 సంవత్సరాల ఇనుగుర్తి ప్రజల చిరకాల కోరిక మండల కేంద్రాన్ని కేసీఆర్ తీర్చారన్నారు. తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ ది అని, షర్మిల శిఖండి రాజకీయాలు మానుకోవాలనని ఆమె హితవు పలికారు. తెలంగాణకు అడ్డుపడ్డ ద్రోహి రాజన్న అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మానుకోట రాళ్లను మరచిపోవద్దని హెచ్చరించారు. తెలంగాణలో అలజడులు సృష్టించడానికే షర్మిల యాత్ర అని, దేశంలో ఎక్కడి లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు.
మీ అన్న ఆంధ్రలో మోటర్ల కు మీటర్లు పెట్టిండని, కేసీఆర్ ఉన్నంత కాలం రైతులకు ఉచిత విద్యుత్ వస్తుందని ఆమె అన్నారు. టీఆర్ఎస్ నాయకులపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో బీజేపీ దాడులు చేస్తుందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఆశీర్వదంతో నేను మంత్రిగా ఉన్నాను ,కేసీఆర్ కి రుణపడి ఉంటానని ఆమె అన్నారు.
అనంతరం ఎంపి మాలోత్ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన సహజంగా యాత్ర చేసుకోవచ్చని, టీఆర్ఎస్ నాయకులను, ప్రజాప్రతినిధులు తిడితే ఊరుకునేదిలేదు అంటూ వైఎస్ షర్మిల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ రాజ్యం మాకు అవసరం లేదు.. నీది ఆంధ్ర… మాది తెలంగాణ అని ఆమె వ్యాఖ్యానించారు. ఏనాడు తెలంగాణ గురించి ఆలోచించని నీవు, నేడు తెలంగాణ కోడలు అనడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో నీవు ఎక్కడ ఉన్నావని, ఆంధ్రలో నీ అన్న తంతే తెలంగాణ కు వచ్చినవు అంటూ ఆమె విమర్శించారు. తెలంగాణలో నీ ఆటలు సాగవని, చిల్లరగా మాట్లాడుతే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి షర్మిల గురికాక తప్పదన్నారు.