విజయసాయిరెడ్డి కొత్తగా పార్టీ పెట్టుకోవడానికి ఆయనకు స్వేచ్ఛ, హక్కు ఉన్నాయని ఏపీ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి లూటీ చేసిన ప్రజాధనం ఎక్కడ దాచారో ముందుగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పై ఉన్న అవినీతి కేసుల్లో ఆయన ఏ2గా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేస్తూ, ఆయనకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. విజయసాయిరెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్ అవినీతికి సంబంధించిన పూర్తి లెక్కలను బహిర్గతం చేయాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే కొత్త పార్టీ పెట్టుకోవాలని హితవు పలికారు.
మరొకవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీరును సైతం ఆయన తీవ్రంగా నిరసించారు. గతంలో కేతిరెడ్డికి ఉన్న డబ్బులు, పేకాట క్లబ్బులు, ఫారిన్ ట్రిప్పులు ముగిసిపోవడంతో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ ‘గుడ్ మార్నింగ్’ కార్యక్రమం పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. కామెడీ షో మాదిరిగా ముందస్తుగా సిద్ధం చేసిన నటులతో వచ్చి డ్రామాలు ఆడుతున్నారని, ఆయన చేసే షోల ముందు జబర్దస్త్ నటులు కూడా పనికిరారని విమర్శించారు. గత 20 ఏళ్లుగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు తనను బాధ్యుడిని చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ గత 10 ఏళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరున్నారో కేతిరెడ్డి ముందుగా సమాధానం చెప్పాలని నిలదీశారు. స్థానిక ఎన్నికలు ముగియగానే కేతిరెడ్డి మళ్లీ తన పాత పేకాట క్లబ్బులకే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు.
చివరగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమిలోని మూడు పార్టీలు (టీడీపీ, జనసేన, బీజేపీ) కలిసి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. దీనికోసం ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

