ఇంగ్లండ్తో వచ్చే నెల ప్రారంభమయ్యే వన్డే సిరీస్కు భారత జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయాలపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను పక్కనబెట్టి.. సీనియర్ రోహిత్ శర్మపై మళ్లీ నమ్మకం ఉంచడాన్ని ప్రశ్నించాడు. ఇటీవలి వన్డే మ్యాచ్ల్లో యశస్వి అద్భుత ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికాపై అజేయంగా 116 పరుగులు చేసిన జైస్వాల్.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్లో కూడా శతకంతో మెరిశాడన్నాడు. చివరి మూడు వన్డే ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు నమోదు చేసిన ఆటగాడికి మరిన్ని అవకాశాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
ఇమేజ్ కారణంగా జట్టులో:
‘భారత్ వంటి బలమైన జట్టులో ఓపెనర్గా అవకాశాలు రావడం అంత సులభం కాదు. అయితే వచ్చిన అవకాశాలను యశస్వి జైస్వాల్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడం కాస్త కఠినమైన నిర్ణయమే’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. అయితే రోహిత్ శర్మ ఎంపికపై పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడలేదు. సెలెక్టర్లు 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ను భాగంగా భావిస్తే అతని ఎంపికను సమర్థించవచ్చని చెప్పాడు. కానీ కేవలం అతని స్టార్ ఇమేజ్ కారణంగా జట్టులో కొనసాగిస్తే.. అది భారత క్రికెట్లో చాలా కాలంగా ఉన్న సమస్యనే ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించాడు.
సెలెక్టర్లు స్పష్టంగా చెప్పాలి:
‘భారత క్రికెట్లో పెద్ద పేరున్న ఆటగాళ్ల విషయంలో నిర్ణయాలు కేవలం ప్రతిభ ఆధారంగా ఉండవు. రోహిత్ శర్మ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అతను 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగమైతే సెలెక్టర్లు స్పష్టంగా చెప్పాలి. కానీ అతన్ని తప్పించడానికి ఇబ్బంది పడి ఎంపిక చేస్తే అది సరైన విధానం కాదు. జట్టు ఎంపికలో వ్యక్తుల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంపికలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదా జస్ప్రీత్ బుమ్రాలకు ఏది మంచిదన్న దానిపై ఆధారపడకూడదు. భారత క్రికెట్కు ఏది ఉత్తమమో అదే ప్రమాణంగా ఉండాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
సూర్యవంశీపై ప్రశంసలు:
మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మంజ్రేకర్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల శ్రీలంక-ఏ ఆటగాడితో జరిగిన చిన్న వివాదం అతనికి మంచి పాఠం నేర్పిందని, కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు ఎంతో పరిణతి చెందిన ఆటగాడిగా కనిపిస్తున్నాడని అన్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో వైభవ్ సూర్యవంశీ మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను మరింత సమర్థంగా ఎదుర్కోగలడని మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

