మనీలాండరింగ్ కేసులో చిక్కుకుని నాలుగు నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించిన నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్ తాజాగా తన జైలు అనుభవాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైలు గోడల మధ్య తాను అనుభవించిన నరకాన్ని వివరిస్తూ, తన శత్రువు కూడా అలాంటి ప్రదేశంలో ఉండకూడదని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి తీహార్ జైలులో అడుగుపెట్టినప్పుడు దేవుడు తనకు ఎందుకు ఇంత కఠినమైన శిక్ష విధించాడని ఎంతో బాధపడ్డానని, అక్కడి వాతావరణం చూసి భయంతో వణికిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : #Suriya46 : సూర్య 46 టైటిల్ హంగామా షురూ.. ఫస్ట్ లుక్ రివీల్ కి టైమ్ టూ డేట్ ఫిక్స్
జైల్లోని దారుణమైన పరిస్థితుల గురించి సందీప మాట్లాడుతూ.. ‘అక్కడ వాష్ రూమ్స్ ఎంతో మురికిగా ఉంటాయి, నేలపైనే పడుకోవాలి. తిండి కూడా ఏమాత్రం రుచిగా ఉండదు.. రోజుకు నాలుగు రోటీలు, అన్నం, పప్పు మాత్రమే ఇస్తారు. గత జన్మలో చేసిన పాపం వల్లే ఈ కర్మ నన్ను వెంటాడుతోందని అనిపించింది. నా వల్ల మా పేరెంట్స్ కూడా జైలుకు వచ్చి నన్ను కలవాల్సి రావడం నన్ను మరింత కృంగదీసింది. కొన్నిసార్లు దేవుడా నన్ను త్వరగా ఇక్కడి నుండి తీసుకెళ్లిపో అని వేడుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. జైలు అధికారులు కూడా కొందరు జాలి చూపిస్తే, మరికొందరు తమ కోపాన్నంతా ఖైదీలపై చూపిస్తారని ఆమె వెల్లడించారు.
అయితే, జైల్లో ఉన్నప్పుడు తన తోటి ఖైదీల దీనస్థితిని చూసి చలించిపోయానని సందీప తెలిపారు. ‘కేవలం మూడు వేల రూపాయల దొంగతనం కేసులో అంధురాలైన తల్లిని వదిలి నెలల తరబడి జైల్లో మగ్గుతున్న ఒక మహిళ, అలాగే భర్త చేసిన ఆర్థిక మోసానికి శిక్ష అనుభవిస్తున్న మరో మహిళకు తాను బయటకు వచ్చాక సాయం చేశానని ఆమె వెల్లడించారు.. ‘జైల్లో డబ్బు లేకపోతే ఎవరూ పట్టించుకోరు’ అంటూ అక్కడ ఉండే చేదు వాస్తవాలను ఆమె కళ్లకు కట్టారు. ప్రస్తుతం సందీప చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.